ఆగ్రా : యూపీలోని ఆగ్రాలో సినిమా తరహాలో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. కమలానగర్లోని సెంట్రల్ బ్యాంక్ రోడ్డులోని మణప్పురం గోల్డ్లోన్ శాఖలో నలుగురు సాయుధులు ప్రవేశించి 17 కిలోల బంగారం, రూ.5లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న ఎస్ఎస్పీతో సహా ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఎట్మాద్పూర్ వద్ద నిందితులను పట్టుకున్నారు. ఈ సమయంలో దొంగలు, పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్కౌంటర్ సమయంలో పోలీసులు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపారు. అలాగే వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చోటు చేసుకుంది.
గోల్డ్ లోన్ కంపెనీ అయిన మణప్పురం గోల్డ్ కమలానగర్లోని సెంట్రల్ బ్యాంక్ రోడ్డులో శాఖను నిర్వహిస్తోంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా నలుగురు సాయుధులు బ్రాంచ్లోకి చొరబడి, సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. అక్కడున్న ఆభరణాలు, నగదుతో పారిపోయారు. సిబ్బంది కేకలు వేయడంతో కాల్చివేస్తామని బెదిరింపులకు దిగారు. సుమారు 20 నిమిషాల పాటు దుండగులు కార్యాలయంలోనే ఉండి.. రూ.5లక్షల నగదుతో పాటు రూ.8 కోట్ల విలువైన 17 కిలో బంగారం ఎత్తుకు వెళ్లారు. ఉద్యోగుల కార్యాలయంలోనే బంధించి.. తర్వాత పారిపోయారు. స్థానికుల సహాయం ఉద్యోగులు బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఎస్పీ మునిరాజ్, సిటీ ఎస్పీ రోహన్ ప్రమోద్, ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. వారి కోసం గాలింపు చేపట్టారు. ఎట్మాద్పూర్ రహదారిపై వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.