చండీగఢ్, ఫిబ్రవరి 20: రైతు ఉద్యమం నేపథ్యంలో దేశం దృష్టి అంతా కేంద్రీకృతమై ఉన్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. 117 స్థానాలకు 24,740 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వ్యవసాయ విధానాలకు రెఫరెండంగా భావిస్తున్న అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో గతంతో పోల్చితే తక్కువ ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. 2017లో పంజాబ్లో 77.4% ఓటింగ్ నమోదు కాగా ప్రస్తుతం మొత్తం ఓటర్లలో 68 శాతం మందే ఓటేశారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికలు జరిగాయి. వృద్ధులను, దివ్యాంగులను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా 196 పింక్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. పంజాబ్లో ఈసారి 1,304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 93 మంది మహిళలు. ఇద్దరు ట్రాన్స్జెండర్లు.
యూపీలో 60 శాతం ఓటింగ్
యూపీలో మూడో విడుత పోలింగ్ ముగిసింది. 59 స్థానాలకు పోలింగ్ జరగ్గా 60% ఓటింగ్ నమోదైంది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ స్థానానికి కూడా ఈ దశలోనే ఓటింగ్ జరిగింది. జశ్వంత్నగర్లో అఖిలేశ్ ఓటు హక్కు వినియోగించుకొన్నారు.