హైదరాబాద్ : శాంతి భద్రతలు, పోలీసు శాఖ సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. బడ్జెట్ 2021లో హోంశాఖకు రూ. 6,465 కోట్లు కేటాయించినట్లు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు, ఫ్రెండ్లీ పోలీసు విధానం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. పోలీసు శాఖకు భారీగా నిధులు కేటాయించి, నూతన వాహనాలను, సాంకేతిక సాధనాలను సమకూర్చిందని తెలిపారు. గుడుంబా, పేకాట, గ్యాంబ్లింగ్ల నిషేధాన్ని అమలు చేస్తున్నారు. కరోనా కాలంలోనూ పోలీసు శాఖ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించింది. అందుకు వారికి అదనంగా ఒక నెల వేతనాన్ని ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. బహిరంగ ప్రదేశాల పర్యవేక్షణ కోసం నగర వ్యాప్తంగా 6 లక్షల 65 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 65 శాతం తెలంగాణలో ఉన్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.