హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎయిర్ ట్రాఫిక్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దూసుకుపోతున్నది. కొవిడ్ తర్వాత మళ్లీ పూర్వ స్థితికి చేరుకోవడంలో ఈ ఎయిర్పోర్టు దేశంలోని ఇతర విమానాశ్రయాల కంటే ఎంతో ముందంజలో ఉన్నది. ప్రత్యేకించి ఇక్కడి నుంచి లండన్కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొవిడ్కు ముందు 2019 ఆగస్టులో శంషాబాద్ విమానాశ్రయం నుంచి 11,911 మంది లండన్కు వెళ్లగా.. ఈ ఏడాది ఆగస్టులో ఆ సంఖ్య 17,584కు పెరిగింది. తద్వారా ఏకంగా 48% వృద్ధిరేటు నమోదైంది. కొవిడ్ తర్వాత దేశంలోని మరే ఇతర ప్రధాన విమానాశ్రయాల్లోనూ లండన్కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఈస్థాయిలో పెరగలేదు. పైపెచ్చు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్కు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 49% తగ్గింది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం ఎయిర్ ట్రాఫిక్లో శంషాబాద్ జోరుకు ప్రధాన కారణం.