ఫ్లాప్ హీరోలకు ఈ వారం అగ్నిపరీక్ష ఎదురు కానుంది. ఒక్కరు ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నారు. అందులో చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలే ఉండటం గమనార్హం. ఎన్నో ఏళ్లుగా సరైన విజయం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న ఈ ముగ్గురు హీరోలు ఒకేరోజు బాక్సాఫీస్ దగ్గర పోటీకి రెడీ అవుతున్నారు. వాళ్లే కార్తికేయ, విష్ణు, ఆది.. ఈ హీరోలు ముగ్గురు మార్చ్ 19న తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఆర్ఎక్స్ 100 తర్వాత సరైన సక్సెస్ కోసం చూస్తున్న కార్తికేయ ఈ వారం చావు కబురు చల్లగా చెప్పడానికి వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 9 కోట్ల బిజినెస్ చేసింది. చాలా రోజుల తర్వాత కార్తికేయ సినిమాపై మంచి ఆసక్తి కనిపిస్తుంది.
ఇక విష్ణు కూడా మోసగాళ్లు సినిమాతో ఈ వారమే వస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ భారీ క్యాస్టింగ్ తో వస్తుంది మోసగాళ్లు. కాజల్ ఇందులో హీరోకు చెల్లిగా నటించడం గమనార్హం. మరోవైపు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రపంచంలో జరిగిన అత్యంత భారీ ఐటి స్కాం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు జెఫ్రీ. మరోవైపు ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న శశి కూడా మార్చ్ 19నే విడుదల కానుంది. కొన్నేళ్లుగా సోలో హిట్ కోసం చూస్తున్న ఈయనకు ఈ సినిమా కీలకంగా మారింది. మొత్తానికి ఈ వారం ఎన్నో ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న హీరోలే వస్తున్నారు. మరి వీళ్లలో ఎవరు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి చూపిస్తారో చూడాలి.