8 ఏండ్లల్లోనే 3 రెట్లు పెరుగుదల
ప్రజలపై పన్ను భారం లేకుండానే పెరిగిన ఆదాయం
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఆదాయపరంగా తెలంగాణ మరో కీలక మైలురాయికి చేరుకొన్నది. ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడులు ఏకంగా 3 రెట్లు పెరగడమే ఇందుకు కారణం. ఈ ఏడాదితో ఈ రాబడులు రూ.లక్ష కోట్లు దాటనున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై ప్రభుత్వం ఎక్కడా పన్నుల భారాన్ని మోపలేదు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల ఆదాయాన్ని పెంచడం, పన్నులను సక్రమంగా వసూలు చేయడం, పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించడం వంటి చర్యలతో సొంత రాబడులను పెంచుకొని దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
అంచనాలను అందుకొంటూ..
రాష్ట్ర సొంత రాబడుల వార్షిక వృద్ధి రేటు 12-15 శాతంగా ఉంటున్నది. అయితే కరోనా మొదటి, రెండో వేవ్ ప్రభావంతో 2018-19 నుంచి 2020-21 వరకు ఆదాయంలో పెద్దగా వృద్ధి నమోదు కాలేదు. 2021-22లో మాత్రం గోడకు కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో వృద్ధిరేటు సాధించింది. బడ్జెట్లో రూ.92,910 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సవరించిన అంచనాల ప్రకారం ఆ లక్ష్యాన్ని సాధించింది. అంతకుముందుతో పోల్చితే ఏకంగా రూ.26 వేల కోట్ల అధిక ఆదాయాన్ని నమోదు చేసింది. అంటే.. రాబడుల్లో 39 శాతం వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సొంత రాబడులు రూ.లక్ష కోట్లు దాటుందని ధీమాగా ఉన్నది.