అత్యాధునిక ఆవిష్కరణలకు మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న హైసియా 29వ
వార్షిక సదస్సు వేదికగా నిలిచింది. యువత తమలో దాగి ఉన్న నైపుణ్యతలకు పదునుపెట్టి ఆరోగ్య సంరక్షణకు, వ్యవసాయ అభివృద్ధికి, మహిళ సంరక్షణకు, రవాణా సులభతరానికి సరికొత్త ఆవిష్కరణలను అందుబాటులో ఉంచారు. సదస్సులో క్యూ -హబ్, టీ -హబ్, జాయ్ టైప్స్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ, ఇమేజ్ సీవోఈ -ఎస్టీపీ, ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్, లైఫ్ సైకుల్, లూకేఫ్ తదితర సంస్థల స్టాల్స్ని ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని సరికొత్త ఆవిష్కరణల వివరాలను తెలుసుకుందాం.
నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే వారి కోసం నో కోడ్ ప్లాట్ఫాం ప్రత్యేక సదుపాయాలను అందిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన వెబ్సైట్లు, ఇతర వివరాలతో కూడిన సైట్లను రూపొందించుకునేందుకు ప్రత్యేక ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కావాల్సిన వివరాలను నో కోడ్ ప్లాట్ఫాం సంస్థకు తెలియజేస్తే అతి తక్కువ సమయంలో ప్లాట్ఫాంను అందజేస్తుంది. తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దేందుకు ప్రత్యేక టీంను అందుబాటులో ఉంచుతుంది. వ్యాపార సంస్థ వారే సమస్యలను సరిదిద్దుకుంటామంటే ఆ వెసులుబాటును కూడా అందిస్తుంది.
అరచేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు విజిటింగ్ కార్డును క్షణాల్లో స్మార్ట్ఫోన్లో వీక్షించే అవకాశాన్ని డాబ్ స్టార్టప్ రూపొందించింది. చైన్నె కేంద్రంగా ఏర్పాటైన స్టార్టప్ మైడాబ్ ది మోస్ట్ అడ్వాన్డ్స్ డిజిటల్ బిజినెస్ కార్డును రూపొందించింది. దీంతో పర్యావరణానికి మేలుతో పాటు క్షణాల్లో విజిటింగ్ కార్డులోని సమాచారం నియల్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) ద్వారా స్మార్ట్ఫోన్ ట్యాప్ చేస్తే చాలు సమగ్ర చిరునామా వివరాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్లు జీమెయిల్ వంటివన్నీ ఎదుటి వారి స్మార్ట్ఫోన్లోకి వస్తాయని డాబ్ స్టార్టప్ వ్యవస్థాపకులు ఎ.దీపక్ అవినాశ్ తెలిపారు.
డీప్ ఫ్యాక్ట్స్ వారు రూపొందించిన వైటల్ ప్యాచ్ పరికరం ఆరోగ్య సమస్యలను పసిగడుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ వైటల్ ప్యాచ్ను ఛాతీ భాగంలోని గుండెకు దగ్గర ఉంచి, మొబైల్కు బ్లూటూత్ ద్వారా ప్రత్యేకించిన యాప్తో అనుసంధానం చేయాలి. శరీర ఉష్ణోగ్రతలు, గుండె పనితీరు, రక్త పోటు, ఆక్సిజన్ లెవెల్స్, ఈసీజీ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే అలర్ట్ చేస్తుంది. వెంటనే వైద్యులకు సమాచారం అందించే వెసులుబాటు కూడా ఉందని స్టార్టప్ వ్యవస్థాపకులు దీలీప్, వంశీలు తెలిపారు. వైద్య సేవలు ఎంతో ఖరీదైన నేపథ్యంలో ఇలాంటి ఉపకరణాల ద్వారా వేగంగా, ఇంటి వద్ద నుంచే వైద్యులను సంప్రదించే అవకాశం కలుగుతుందని తెలిపారు.
మహిళల సంరక్షణకు సరికొత్తగా ‘లైఫ్ ఆఫ్ గర్ల్’ నూతన యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఒంటరిగా ప్రయాణించే మహిళలు ముందుగానే వారి ప్రయాణ మార్గం వివరాలను తెలుసుకోగలరు. దీంతో ముందుగానే జాగ్రత్త పడి ప్రమాదకరమైన మార్గాల్లో ఒంటరి ప్రయాణాలు మానుకోవచ్చు. యాప్లో బంధువులు, స్నేహితులు, తెలిసిన వ్యక్తుల వివరాలను పొందుపరచడంతో ప్రయాణ మార్గాల్లో వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఉన్న ఎస్ఓఎస్ (సేవ్ అవర్ సోల్స్) ద్వారా ప్రమాద సమయాల్లో పోలీసులకు, వలంటీర్లకు వెంటనే సమాచారం అందేలా యాప్ చర్యలు తీసుకుంటుంది.
అత్యవసర పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టు ఇబ్బందులున్న ప్రాంతాలకు మందులతో పాటు వ్యాక్సిన్లు, బ్లడ్ శాంపిల్స్ని చేరవేసేందుకు హెలికాప్టర్ డ్రోన్ల పనితీరు అద్భుతంగా ఉంది. 25 కేజీల బరువున్న ఈ డ్రోన్ 16 కేజీల బరువున్న మెడిసిన్లను మోసకెళ్లగలదు. 50 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరుకునేలా రూపొదించారు. అవయవాల తరలింపులోనూ ఈ డ్రోన్లను వినియోగించేలా పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు మారుత్ డ్రోన్స్ సంస్థ ప్రతినిధి ప్రేమ్ తెలిపారు. డ్రోన్స్ టెక్నాలజీని మరింత విస్తృత్త చేసేందుకు అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్నామని చెప్పారు.
వ్యవసాయ క్షేత్రాలకు విత్తనాలను సులభంగా మోసుకెళ్లేందుకు సీడ్ కాప్టర్ డ్రోన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 18 కేజీల బరువుండే ఈ డ్రోన్ 10 కేజీల విత్తనాలను 5 కిలో మీటర్ల దూరం మోసుకెళ్లగలదు. బ్యాటరీలతో పని చేసే ఈ డ్రోన్లకు 40 నిమిషాల చార్జింగ్ పెడితే రోజంతా పని చేస్తాయి.
మాదాపూర్, డిసెంబర్ 16: మాదాపూర్లోని హైటెక్స్లో ఎనాలిటికా అనకాన్ ఇండియా, ల్యాబ్ ఎక్స్పో 2021 కార్యక్రమాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లుపిన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ దేశాయ్, ఫుజీ ఫిల్మ్ వాకో ప్యూర్ కెమికల్ కార్పొరేషన్ కంట్రీ హెడ్, డాక్టర్ నిధి ఆర్య, యూఎస్ ఫార్మా కోపియా ఇండియా సీనియర్ డైరెక్టర్ మాతృప్రసాద్ ప్రియదర్శిని, ఇండియన్ ఫార్మాసిటికల్ అలియన్స్ అడ్వైజర్, శిరీష్ బాలపిర్, ఐఏఐఏ అధ్యక్షుడు గౌతమ్ రాజన్, అరబిందో ఫార్మా లిమిటెడ్ చీఫ్ క్వాలిటీ ఆఫీసర్, ప్రెసిడెంట్, డాక్టర్ ఆర్మ్ రావు, మంచెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ యూనిట్ హెడ్ అవిశా దేశాయ్, ఆంటెలియా సైంటిఫిక్ జనరల్ మేనేజర్ వీరేంద్ర అపతిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇందులో భాగంగా పలు పరిశ్రమలకు చెందిన నిపుణులు యువత వ్యాపార అవకాశాలను ఏ విధంగా మెరుగు పరుచుకోవచ్చో తెలియజేశారు. ఇందులో ఫార్మా కంపెనీలు, పరిశోధన సంస్థలు, ఫుడ్ పార్క్, లేబరొటరీలు, ఆర్ అండ్ డీ సెంటర్లకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో 200లకు పైగా స్టాల్స్లనుస్టాల్స్లను అందుబాటులో ఉంచారు.
కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ తెలంగాణలో ఐటీ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేసుకొని… జాతీయ గణాంకాలకు సంబంధించి వృద్ధి రేటును కొనసాగించిందని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ సీవీడీ రామ్ప్రసాద్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించామని, స్థిరమైన ఉపాధి లభించిందని ఆయన తెలిపారు.
హైసియా అవార్డుల ప్రధానం హెచ్ఐసీసీలో గురువారం రాత్రి జరిగింది. ఇందులో ఎగుమతుల అవార్డులను మూడు సంస్థలకు అందజేశారు. వీటిలో ఇన్ఫోసిస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా లిమిటెడ్ ఉన్నాయి. అదేవిధంగా ఐటీ/ఐటీ ఈఎస్ కేటగిరీలో మైక్రోసాఫ్ట్ ఇండియా (ఆర్అండ్డీ) ప్రైవేట్ లిమిటెడ్, క్వాల్క్వామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. రూ.1000 కోట్ల కేటగిరీలో భారతదేశానికి చెందిన ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలైన సెయింట్ లిమిటెడ్, మైండ్ ట్రీ లిమిటెడ్కు అవార్డులు దక్కాయి.రూ.500 కోట్ల కేటగిరీలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎంఎన్సీ కంపెనీ అమెజాన్ ఐటీ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు అవార్డు ఇచ్చారు.