లిమా: పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడిపోవడంతో 27 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులతో వారి పాలొమినో కంపెనీకి చెందిన బస్సు.. పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తున్నది. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంటరియోసియానిక్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా లోయలో పడిపోయింది. దీంతో 27 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పెరూ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.