సూర్యాపేట లీగల్, నవంబర్ 17: ఐదేండ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన కామాంధుడికి సూర్యాపేట కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన భీమ్శెట్టి నాగరాజు (38) ఆటో డ్రైవర్. పిల్లలను తన ఆటోలో స్కూల్కు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో 2016లో ఎల్కేజీ చదువుతున్న ఐదేండ్ల చిన్నారికి కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు దవాఖానలో చూపించారు. పరీక్షించిన వైద్యుడు జననాంగం వద్ద రాపిడి జరిగిందని చెప్పగా.. చిన్నారిని తల్లి వివరాలు అడిగింది.
12 మార్చి 2016న ఆటో డ్రైవర్ నాగరాజు స్కూల్ వదలగానే తనను ఆటోలో తీసుకెళ్లి సద్దుల చెరువు గట్టుపై ఏదో చేశాడని చెప్పింది. దీంతో చిన్నారి తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం 12 మంది సాక్షులను విచారించిన చిన్నపిల్లలపై అత్యాచార నిరోధక చట్టం న్యాయస్థానం జడ్జి పీ వసంత్పాటిల్ బుధవారం తీర్పు వెలువరించారు. నాగరాజుకు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు.