న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ చేతిలో 17.99 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు తేలింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ నమోదు చేసింది. ఇందులో నోటిఫై చేసిన 62 కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా, మిగతా 16.38 లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా 4,900 పాకెట్స్లో విస్తరించి ఉన్నది. ఈ 17.99 లక్షల ఎకరాలకు గానూ 17.78 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ వెల్లడించింది. డ్రోన్లు, శాటిలైట్లు, జీపీఎస్ సాయంతో 2018 అక్టోబర్లో ఈ సర్వే ప్రారంభమైంది. సర్వేలో రాష్ర్టాల రెవెన్యూ అధికారుల సాయం కూడా తీసుకున్నారు.
ఎలా నిర్వహించారు?
ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్(ఈటీఎస్), డిఫ్రెన్సియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(డీజీపీఎస్) వంటి ఆధునిక టెక్నాలజీలను సర్వేలో వాడారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు డ్రోన్, శాటిలైట్ ఇమేజరీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. సర్వేలో భాగంగా రక్షణ భూముల్లో ఆక్రమణలను గుర్తించేందుకు టైం సిరీస్ శాటిలైట్ ఇమేజరీ ఆధారిత రియల్ టైం ఛేంజ్ డిటెక్షన్ ప్రాజెక్టు కూడా చేపట్టారు. హైదరాబాద్కి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి సేకరించిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పైలట్ ప్రాజెక్టు కింద రక్షణ భూముల ఉపగ్రహ చిత్రాల మీద ప్రయోగించారు. సర్వే చేసిన భూముల వివరాలను డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచారు.
అతిపెద్ద భూస్వామి కేంద్ర ప్రభుత్వం!
దేశంలో అతిపెద్ద భూస్వామి కేంద్ర ప్రభుత్వమే. ఢిల్లీ పరిమాణం కంటే తొమ్మిది రెట్ల భూభాగం కేంద్రం చేతిలో ఉన్నది. కేంద్రంలో రైల్వే శాఖ తర్వాత ఎక్కువ భూములు రక్షణశాఖ వద్దనే ఉన్నాయి.
సర్వే అవసరం ఏంటి?
రక్షణ శాఖ ఆధీనంలో ఉండే భూములను గుర్తించి, వాటి సరిహద్దును నిర్ధారించేందుకు ఈ సర్వే నిర్వహించారు. ఇది భూరికార్డులు, మ్యాపులను ఆధునీకరించడంతో పాటు ఆక్రమణలకు గురికాకుండా నిరోధించేందుకు సాయపడుతుంది. లక్షల ఎకరాల భూమిని మాన్యువల్గా సర్వే నిర్వహించాలంటే ఏండ్ల సమయం పడుతుంది. అందుకే పనిని వేగంగా, కచ్చితంగా పూర్తి చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు.