న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్కు భారత్ నుంచి 101 మంది సైనికులను పంపనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి రష్యాలో అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఆర్మీ స్కౌట్ మాస్టర్స్ కాంపిటీషన్ (ASMC), ఎల్బ్రస్ రింగ్, పోలార్ స్టార్, స్నిపర్ ఫ్రాంటియర్, సేఫ్ రూట్ గేమ్స్లో భారత సైన్యం పాల్గొంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. పాంటూన్ బ్రిడ్జ్ నిర్మాణం.. యూఏవీ సిబ్బంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ గేమ్స్ను ‘వార్ ఒలింపిక్స్’ పేరుతోనూ పిలుస్తుంటారు. పోటీలు ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
42 దేశాల నుంచి 280కిపైగా జట్లు పాల్గొని నైపుణ్యాలను ప్రదర్శించనున్నాయి. వివిధ స్థాయిల్లో పరిశీలన అనంతరం.. భారత జట్టును ఎంపిక చేయనున్నారు. భారత్లో 2019 జైసల్మేర్లో జరిగిన పోటీల్లో ఆర్మీ స్కౌట్ మాస్టర్లో మొదటి స్థానంలో నిలిచింది. పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల సైన్యం నైపుణ్యానికి ప్రతిబింబంగా నిలువనున్నాయి. రష్యాలో జరుగనున్న ఆర్మీ గేమ్స్ ఏడో ఎడిషన్ పోటీలు కాగా.. అమెరికా, ఇంగ్లాండ్, కెనడాతో పాటు పశ్చిమ యూరోపియన్ యూనియన్ దేశాలు పోటీల్లో పాల్గొనడం లేదు.