సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడమే లక్ష్యంగా హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ స్వయంగా రంగంలోకి దిగారు. వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించడమే కాకుండా ఇంటింటికీ తిరుగుతూ.. ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. వ్యాక్సిన్ తీసుకున్నారా.. రెండు డోసులు పూర్తయ్యాయా.. అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం సికింద్రాబాద్లోని రసూల్పుర, పికెట్ ప్రాంతాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా కేంద్రాలకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేపట్టి రెండో విడత వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకున్నారా.. అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.