హైదరాబాద్, మార్చి 24: విమానయాన రంగంలోకి ఇటీవల ప్రవేశించిన ఫ్లైబిగ్ దూసుకుపోతున్నది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమానాలు నడుపాలనే ఉద్దేశంతో 10 డే హేవిలాండ్ కెనడా ట్విన్ ఒటర్ సిరీస్ 400 ఎయిర్క్రాఫ్ట్లకు కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా కార్యక్రమంలో ఇరు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం గురువారం జరిగింది.
ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ..బెంగళూరులో ప్రపంచ స్థాయి గ్లోబల్ సైప్లె చెయిన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా ఆపరేషన్స్ ఎండీ సందీప్ శర్మ మాట్లాడుతూ..ఈ నూతన సెంటర్ కోసం 160 మంది ఏరోస్పెస్ అనలిస్ట్, డాటా సైంటిస్ట్లను నియమించుకున్నట్లు, ఈ సెంటర్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పారు. భారత్లో ఇంజిన్ ఎంఆర్వో(మెంటనెన్స్, మరమ్మత్తులు, మొత్తం) సెంటర్ ఏర్పాటుపై కంపెనీ ప్రెసిడెంట్ అశ్మితా సేతి మాట్లాడుతూ..ఈ ఎంఆర్వో సెంటర్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భారత్లో ప్రతియేటా బిలియన్ డాలర్ల విలువైన విమాన మరమ్మత్తులు సింగపూర్, మధ్య ప్రాచ్య, హాంకాంగ్ దేశాల్లో జరుగుతున్నాయని, ఈ రంగానికి చెందిన సంస్థలకు రాయితీలు ఇస్తే ఇక్కడే ఎంఆర్వో సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలు ముందుకు వస్తాయన్నారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్లో కస్టమర్ శిక్షణ కేంద్రం ఉన్నది.