డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హిమపాతం 10 మంది ట్రెయినీ పర్వతారోహకులను బలిగొన్నది. ఈ ఉదయం 29 మంది ట్రెయినీ పర్వతారోహకులు 16 వేల అడుగుల ఎత్తున్న ఓ పర్వతాన్ని అధిరోహిస్తుండగా భారీ హిమపాతం సంభవించింది. పది మంది ట్రెయినీ పర్వతారోహకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు.
రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ హెలిక్యాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్లో రెస్క్యూ టీమ్స్ ఇప్పటివరకు 8 మందిని ప్రాణాలతో కాపాడాయి. 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా 11 మంది కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్నది.
ఉత్తర కాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న 29 మంది ట్రెయినీ పర్వతారోహకులు ఇవాళ ఉదయం 9 గంటలకు 16 వేల అడుగుల ఎత్తున్న పర్వతాన్ని అధిరోహిస్తుండగా ప్రమాదం బారినపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.