విదేశాల్లో ఉన్నతోద్యోగం కన్నా.. ఉన్న ఊరిలో వ్యవసాయమే మేలనుకొన్నాడు.ఎంటెక్ తర్వాత.. కోడింగ్, డీకోడింగ్కు బదులుగా, సేద్యంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితోనే వినూత్నమైన పంటలు సాగు చేస్తూ.. ‘హైటెక్ రైతు’గా గుర్తింపు పొందాడు స్టాలిన్.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చెందిన ఇట్టమల్ల స్టాలిన్, ఎంటెక్ దాకా చదివాడు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు వచ్చినా, వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకొన్నాడు. తనకు వారసత్వంగా వచ్చిన పదెకరాల్లో వివిధ రకాల కొత్త పంటలు పండిస్తున్నాడు. ఏడేండ్లుగా సుమారు 30 రకాల పంటలు పండించి, అందరినోటా ‘ఔరా’అనిపిస్తున్నాడు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి, సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు.
వరిలో ఐదు రకాలు
ఒకేసారి ఐదు రకాల వరి వంగడాలను సాగు చేస్తున్నాడు స్టాలిన్. ఏడెకరాల్లో సన్నరకం, దొడ్డురకం, రెడ్ రైస్ (నవ్వార రైస్)తోపాటు రెండు రకాల బ్లాక్ రైస్ను పండిస్తున్నాడు. ఈ ఐదు రకాల్లోనూ ఖర్చులు తగ్గించే విధానాలపై ప్రయోగాలు చేస్తున్నాడు. గతేడాది వెదజల్లే పద్ధ్దతి, డ్రమ్ సీడర్తో సాగు చేసి మంచి దిగుబడి సాధించాడు. అంతకుముందు బాస్మతి వరినీ పండించాడు.
కూరగాయల సాగులోనూ..
కూరగాయల సాగులో కూడా మంచి ఫలితాలను సాధిస్తున్నాడు స్టాలిన్. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎకరంలో షేడ్ నెట్ హౌస్ను వేశాడు. సుమారు 20 రకాల కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, ఉల్లిగడ్డ సాగు చేస్తున్నాడు. ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకుండా అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. ఏటా సీజన్ల వారీగా నాలుగు రకాల పంటలు వేస్తూ, మంచి రాబడి పొందుతున్నాడు. వరి, కూరగాయలతోపాటు తన వ్యవసాయ క్షేత్రంలో ఒక ఎకరంలో చేపల చెరువును తవ్వించాడు. చేప పిల్లలను విక్రయించడం ద్వారా లాభాలు పొందవచ్చని చెబుతున్నాడు.
నిత్య విద్యార్థి..
తరచూ బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్లాంటి ప్రాంతాల్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు వెళ్తూ, సాగులో కొత్త మెళకువలు నేర్చుకుంటున్నాడు స్టాలిన్. ఏటా ఒక నూతన వంగడాన్ని తన క్షేత్రంలో పండిస్తున్నాడు. ఇలా రెండేండ్ల క్రితం కొలంబో కందిని ప్రయోగాత్మకంగా సాగు చేసి, మంచి ఫలితాలు సాధించాడు. దీనిని ఒకసారి సాగు చేస్తే మూడేండ్లపాటు దిగుబడిని ఇస్తుంది. ఏడాదికి రెండుసార్లు పంట చేతికి వస్తుంది. ఇలాంటి సరికొత్త పంటలు సాగు చేస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు స్టాలిన్.
కూలీల సంఖ్య తగ్గించేలా..
వ్యవసాయంలో కూలీల కొరత ఎక్కువ. అధిక కూలీ ధరలు రైతుకు భారంగా మారుతున్నాయి. అయితే, నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా కూలీల సంఖ్య తగ్గించ వచ్చు. ఇద్దరు వ్యక్తులు పది ఎకరాలు సాగు చేసేలా ప్రయోగాలు చేస్తున్నా. వరిలో వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్
విధానంతో కొంతమేరకు విజయం సాధించాం. ఈ విధానాలతో కూలీల అవసరం బాగా తగ్గింది. మూస ధోరణిని విడిచిపెట్టి, ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేయాలి. అప్పుడే రైతులకు లాభాలు వస్తాయి.
-ఇట్టమల్ల స్టాలిన్
-కంచుగట్ల ప్రవీణ్, సూర్యాపేట