రాష్ర్టాలన్నింటికంటే అతి చిన్న వయస్సును కలిగిన తెలంగాణ రాష్ట్రం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టడం సాహసోపేతం. దేశంలో అత్యధిక జనాభా కలిగిన సముదాయాల్లో దళిత కులాలు అగ్రభాగంలో నిలుస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 17 శాతం జనాభా కలిగి ఉన్నాయి. ఈ వర్గాల అభ్యున్నతి పేర గడిచిన ఏడున్నర దశాబ్దాల్లో కోట్ల రూపాయల వ్యయంతో అనేక పథకాలను అమలు జరిపారు. కానీ వాటిద్వారా ఈ వర్గాలు ఎలాంటి మౌలిక మార్పులకు నోచుకోలేదు. దళిత జనోద్ధారక పథకాల ఫలితాలను విశ్లేషించిన శాస్త్రీయ నివేదికలు అనేకం ఉన్నప్పటికీ వాటిని అవగాహన చేసుకొని మార్పులు చేసే సాహసం ఎవరూ చేయలేదు.
2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా దళిత జనాభా కలిగిన పంజాబ్ (32 శాతం), హిమాచల్ప్రదేశ్ (25 శాతం), పశ్చిమబెంగాల్ (24 శాతం), ఉత్తరప్రదేశ్ (21 శాతం), హర్యానా (20.17), తమిళనాడు (20.01 శాతం) ఈ ఆరు రాష్ర్టాలు వివిధ పథకాలను అమలుచేసినప్పటికీ దళిత సాధికారతను సాధించలేకపోయాయి. దేశంలోనే ప్రథమ దళిత మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తర్ప్రదేశ్లో నాలుగు పర్యాయాలు పనిచేసిన మాయావతి హయాంలోనూ దళితుల అభ్యున్నతి ఆశించిన రీతిలో జరుగలేదు.
రెండేండ్ల కిందట తమ చింతమడక గ్రామాన్ని సందర్శించిన సందర్భంలోనే కేసీఆర్ ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధిని చేకూర్చే కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి అమలు జరిపారు. ఆ తర్వాత తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లిలోనూ ప్రత్యేక ప్రణాళికను అమలుపరిచారు. ఈ నేపథ్యంలో తన అనుభవాలను జోడించి ‘దళితబంధు’ను రూపకల్పన చేసినట్టు అర్థమవుతున్నది. గత బడ్జెట్ కేటాయింపుల సందర్భంలోనే ఈ ఆలోచనలకు అంకురార్పణగా రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. దాదాపు ఆరు నెలల కిందట ఉద్యమ సహచరుడు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసినప్పుడు కేసీఆర్ ఆలోచనలు అమల్లోకి వస్తే దళితులకు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం రాబోతున్నదని గొప్పగా చెప్పారు. అప్పటికి ‘దళితబంధు’ అనే అంశం ఎక్కడా చర్చకు కూడా రాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామసభలో కేసీఆర్ ప్రసంగం ‘దళితబంధు’ స్వరూప, స్వభావాలను సంపూర్ణంగా బహిర్గతం చేసింది.
హుజూరాబాద్ నుంచి వచ్చిన 400 మందికి పైగా ప్రతినిధులతో ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే దళిత ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించి అందరి సూచనలను స్వీకరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఒక మిత్రుని ద్వారా నేను సేకరించిన 29 పేజీల రాత ప్రతిని పరిశీలించినప్పుడు ముఖ్యమంత్రి ఇతరుల అభిప్రాయాలకు ఎంత విలువనిస్తారో తెలుసుకొని ఆశ్చర్యపోయాను. సీఎం కేసీఆర్ కీలకమైన అంశం మీద తుది నిర్ణయానికి వచ్చేముందు విస్తృత అభిప్రాయ సేకరణ క్రమాన్ని పలు సందర్భాల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తరచూ ప్రస్తావిస్తారు. అందువల్ల వేల కోట్ల రూపాయలు, వ్యయ ప్రయాసలతో ముడివడి ఉన్న ‘దళితబంధు’ వంటి పథకాల గురించి మాట్లాడే సందర్భంలో, అనివార్యంగా ఒనగూరే రాజకీయ లబ్ధి కంటే అణచివేతకు గురైన దళితులకు సంక్రమించనున్న సాధికారితను ప్రధానం చేసి పరిశీలించడాన్ని పౌర సమాజం అలవర్చుకోవాలి.
‘దళితబంధు’ పథకం అమల్లో భాగంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల నగదు మూలధనాన్ని ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకువస్తున్నది. ప్రభుత్వం సమకూర్చే ఈ మూలధనాన్ని లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల లబ్ధిదారులకు వాయిదా చెల్లింపుల భయాందోళనల్లేవు. బ్యాంకు ష్యూరిటీలు, గ్యారంటీల బాధల్లేవు. ప్రభుత్వం సమకూర్చే ఈ మూలధనం మీద లబ్ధిదారులకే పూర్తి అధికారం ఉంటుంది. ఈ ఆర్థిక వెసులుబాటుతో లబ్ధిదారులు తనకు ఇష్టమైన వ్యాపార, సేవారంగాలకు సంబంధించిన కార్యకలాపాలను ఎంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామీణ ప్రాంతాల దళిత కుటుంబాలు ఆర్థికవ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తాయి. ‘సామాజిక సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నట్టుగా ‘దళితబంధు’ పథకం ద్వారా లభించే ఆర్థిక స్వావలంబన సామాజిక సంబంధాల్లోనూ సమూల మార్పులకు దోహదం చేస్తుంది.
తరతరాలుగా అణచివేతకు గురైన దళితవర్గాలు ఆర్థిక వెసులుబాటు, తద్వారా అందిపుచ్చుకున్న ఉత్పత్తి కార్యకలాపాల్లో భాగస్వామ్యం కారణంగా సమాజంలోని ఇతర వర్గాల ప్రజలతో పాటు సమాన ప్రాతినిధ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఫలితంగా అన్నివర్గాల ప్రజలతో సామాజిక సంబంధాలు మరింతగా బలపడేందుకు అవకాశం లభిస్తుంది. ఉత్పత్తి కారక సంబంధాల పర్యవసానంగా ఏర్పడే మానవ సంబంధాలు అనివార్యంగా అంటరానితనం లాంటి సామాజిక రుగ్మతలకు అతీతమైన పద్ధతిలో బలపడతాయి. అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలోని దళిత కుటుంబాలు సామాజిక అసమానతల నుంచి, ఆర్థిక వెనకబాటుతనం నుంచి, అంటరానితనం నుంచి శాశ్వతంగా విముక్తం కావడానికి ముఖ్యమంత్రి మేధోమథనం నుంచి రూపుదిద్దుకున్న ‘దళిత బంధు’ పథకం బాటలు వేస్తుంది. సామాజిక విప్లవ కార్యాచరణలో ఇంతకుమించిన ప్రయోజనం ఇంకేముంటుంది?
పిట్టల రవీందర్