మునిపల్లి, జూలై 18 : అసలే వర్షాకాలం.. ఆపై సీజనల్ వ్యాధుల భయం.. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యాలతో పాటు రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇన్లు వంటివి ప్రజలను ఇబ్బంది పెడుతాయి. అయితే ఇంకా కరోనా కేసులు నమోదువుతున్న కారణంగా సీజనల్ వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సీజనల్ వ్యాధులు కరోనా మహమ్మారి బారిన పడడానికి కారణం కావచ్చని కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
నీరు నిల్వ ఉండకుండా చూడాలి..
వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వ్యాపించే ప్రమాదముం ది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే దోమలకు ఆవాసాలుగా మారుతాయి. మరో పక్క వ్యర్థ నీటితో తాగు నీరు కలుషితమయ్యే ప్రమాదముంది. ఈ క్రమంలో ప్రజలకు అతిసార, దోమలతో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపుతో పాటు ఇతర విషజ్వరాలు వ్యాపించే అవకాశముం దని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
తలనొప్పి, వాంతులతో మలేరియా
మలేరియా వచ్చిన వారికి రెండు రోజులకొక్కసారి చలిజ్వరం వస్తుంది. తలనొప్పి, వాంతులతో కూడిన జ్వరం రావడం, జ్వరం తీవ్రత తగ్గకపోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీని నివారణ కోసం ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ప్రజలు ఇండ్లలో దోమ తెరలు వాడాలి. గృహాల్లోని కూ లర్లు, కుండీల్లో నీటిని ఖాళీ చేసి, వారానికోసారి వాటిని ఎండబెడుతూ శుభ్రం చేసుకోవాలి.
నీటి కాలుష్యంతో వచ్చే వ్యాధులు..
వానకాలంలో దుమ్ము, చెత్త, బురుద, వరదనీరు, కొన్ని రసాయనాలు కలిసి నీటిని కలుషితం చేస్తాయి. నీటి కాలు ష్యంతో కలరా, విరేచనాలు, పచ్చకామెర్లు, పోలి యో, చీము రక్తవిరేచనాలు, టైఫాయిడ్, నులి పురుగుల వ్యాధులు రావచ్చు. కలరా, నీళ్లు విరేచనాలు ప్రాణాలు తీసే రోగాలు. పచ్చకామెర్లు దీర్ఘకాలిక బాధిస్తుంది. ముదిరితే ప్రాణాలు తీయవచ్చు. జీవితాంతం అం గవైకల్యం కలిగిస్తుంది. నులి పురుగులు దీర్ఘాకాలం మనిషిని బాధపెడతాయి.
బహిరంగ మలమూత్ర విసర్జనతో..
వర్షాకాలంలో గ్రామాలు, పట్టణాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మల విసర్జన చేయడంతో పరిసరాలు అపరిశుభ్రమవుతాయి. ఐదేండ్లలోపు పిల్లలకు అంటువ్యాధులు సోకి అధిక మరణాలు జరగడానికి మలవిసర్జన ముఖ్యకారణమవుతున్నది. శాస్త్రీయ మరుగుదొడ్లను వాడితే మలం ద్వారా వచ్చే వ్యాధులను అతి సులభంగా నివరించవచ్చు.
డెంగీతో..
అకస్మాత్తుగా జ్వరం ఉధృతం కావడం, విపరీతమైన తలనొప్పి, కండరాలు, కీళ్లు, ఒళ్లు నొప్పులు రావడం, వాంతులతో నో రు ఎండిపోవడం, అధిక దాహం, శరీరంపై ఎర్రటి దద్దులు, పల్స్, రక్తపోటు తక్కువ కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పందులు, దోమలతో మెదడువాపు..
పందులు, దోమలతో మెదడు వాపు సోకుతుంది. ఈ వైరస్ సోకితే, జ్వరంతో కళ్లు తిరగడం, విపరీతమైన తలనొప్పి, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీని నివారణ కోసం జననివాస ప్రాంతాలకు దూరంగా పందులు ఉండేలా గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు చర్యలు తీసుకోవాలి. గృహాల మధ్య నీరు నిల్వ ఉన్నచోట కిరోసిన్ లేదా ఆయిల్ బాల్స్ వేయాలి. దీంతో చాలా వరకు దోమలను నివారించవచ్చు.
అతిసారతో నీరసం..
ఈ వ్యాధితో శరీరంలోని నీటి లవణాలు తక్కువై, కడుపునొప్పితో పాటు నీరసించిపోతారు. విరేచనాలు అయి శరీరంలోని నీరు శాతం తగ్గి, నీరసం పెరుగుతుంది. అతిసార బారిన పడితే, ఎలక్ట్రోల్ పౌడర్ను మంచి నీటితో కలిపి తాగించాలి. కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలి. రోడ్డుకిరువైపులా విక్రయించే ఆహార పదార్థాలను తినొద్దు. ఇండ్లలోనూ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త అవసరం
అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముందని, అప్రమత్తంగా ఉండే అవసరం ఎంతైనా ఉందని, ఇక సీజనల్ వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తున్నది. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, క్షయ, ఇన్లుఎంజా, హెచ్ఐవీ, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పోస్ట్ కొవిడ్ బాధితుల్లో విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో సారి హెచ్చరిస్తోంది.
తాగునీరు కలుషితం కానివ్వొద్దు..
తాగునీటి వనరుల్లో పశువులను కడగకూడదు. చేతిపంపుల చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సాయంతో మీ గ్రామంలో తాగునీటిని పరీక్ష చేయించండి. ఆరోగ్య కార్యకర్తల దగ్గర క్లోరిన్ ట్యాబ్లెట్లు ఉచితంగా లభిస్తాయి. వాటిని పొడి చేసుకొని తాగునీటిలో కలిపి రక్షించుకోవచ్చు. ఒక క్లోరిన్ ట్యాబ్లెట్ 20లీటర్ల నీటిని క్లోరినేషన్ చేస్తోంది. వీలైనంత వరకు గుంటలు, చెరువుల్లో నీళ్లు తాగొద్దు. వీధి కుళాయిల నుంచి తెచ్చుకున్న నీటిని కాచి చల్లార్చి తాగాలి.
దోమకాటుకు గురి కాకుండా చూసుకోవాలి
ప్రజలు ప్రధానంగా దోమకాటుకు గురికాకుండా చూసుకోవాలి. ఇండ్లల్లో దోమ తెరలు, కిటికీలకు తీగ మెష్లు అమర్చుకోవాలి. ఇండ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పైన తెలిపిన లక్షణాలను బట్టి జబ్బులను గుర్తించవచ్చు. ఆయా వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం చేయరాదు.