వానకాలంలో పెరిగిన దిగుబడి
అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు
ఆనందంలో అన్నదాతలు
గంగాధర, డిసెంబర్ 4: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలతో మండలంలో వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు, 24 గంటల విద్యుత్ ఇస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో చెరువులు నింపడంతో సాగు గణనీయంగా పెరిగింది. ఏళ్లకు ఏళ్లు బీళ్లుగా ఉన్న భూములు కూడా సాగుకు నోచుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేశారు. దీంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.
పెరిగిన ధాన్యం దిగుబడి
గంగాధర మండలంలో 33గ్రామాలుండగా ఐకేపీ ఆధ్వర్యంలో 10, గంగాధర విండో ఆధ్వర్యంలో 12, కురిక్యాల విండో పరిధిలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 3వ తేదీ వరకు ఐకేపీ ఆధ్వర్యలో 940 మంది రైతుల నుంచి 56,107 క్వింటాళ్లు కొనుగోలు చేసి, 54,565 క్వింటాళ్లు మిల్లులకు తరలించగా, మరో 1,542 క్వింటాళ్లు కొనుగోలు చేసే అవకాశ ముంది. కురిక్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 866 మంది నుంచి 45వేల క్వింటాళ్లు కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. మరో 5వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే అవకాశముంది. గంగాధర పీఏసీఎస్ ఆధ్వర్యంలో 716 మంది నుంచి 59,671 క్వింటాళ్లు కొనుగోలు చేసి, 58వేల క్వింటాళ్లు మిల్లులకు తరలించారు. మరో 40వేల క్వింటాళ్లు కొనుగోలు చేసే అవకాశముంది.
దిగుబడికి అనుగుణంగా కేంద్రాలు
పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గంగాధర సింగిల్ విండో పరిధిలో ఈ ఏడాది 12 కొనుగోలు కేంద్రాల ద్వారా 59,671 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నాం.