మన శరీరంలో వెన్నెముక, మెదడు చాలా సంక్లిష్టమైన భాగాలు. ఒక్కసారి దెబ్బతింటే, మళ్లీ మామూలు స్థితికి రావడం దాదాపుగా అసాధ్యం. అందుకే, వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్న వారు, మంచానికే పరిమితం అవుతుంటారు. ఈ పరిమితిని త్వరలోనే జయించబోతున్నాం. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇందుకు కచ్చితమైన మందును కనిపెట్టామని చెబుతున్నారు. ఇందుకోసం వారు నానోఫైబర్ పదార్థాలను నేరుగా గాయపడినచోటికి ఇంజక్షన్ రూపంలో పంపుతారు. ఇవి అక్కడున్న న్యూరాన్లను ఉత్తేజపరిచి వాటి సంఖ్య పెరిగేలా చేస్తాయి. గాయపడిన కణజాలం (స్కార్ టిష్యూ) కోలుకునేలా, రక్త ప్రసరణ పెరిగేలా, మెదడుతో సంకేతాలు మెరుగయ్యేలా… మొత్తానికి అన్ని విధాలా పూర్వ దశకు చేరుకునేలా సాయపడుతాయి. ఈ విధానాన్ని ఎలుకల మీద ప్రయోగించి విజయం సాధించామనీ, ఇక మనుషులకు అన్వయించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ చికిత్సతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి సమస్యలను నివారించే అవకాశాలు లేకపోలేదు.