హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయించాలని లక్ష్యం విధించారు. బుధవారం బీఆర్కేభవన్లో ఆయిల్పామ్ సాగుపై ఉద్యానవన, పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. రైతులు మెరుగైన ఆదాయం పొందేందుకు వరిపంటతో పోలిస్తే ఆయిల్పామ్ సాగుతో 4 నుంచి 5 రెట్లు ఎక్కువ ఆదాయం పొందవచ్చునని ఒక అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. తెలంగాణలోని చాలా ప్రాంతాలు ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని కేంద్రం ఒక నివేదికలో పేర్కొన్నదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 నర్సరీల ద్వారా 23.41 లక్షల ఆయిల్పామ్ మొక్కలు పెంచారని, 36 వేల ఎకరాల్లో సాగుకు ఇవి సరిపోతాయని అధికారులు సీఎస్కు వివరించారు. 2.11 కోట్ల ఆయిల్పామ్ మొక్కల సరఫరాకు వివిధ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్పామ్ విత్తనాలపై కస్టమ్స్ డ్యూటీ 30 నుంచి 5 శాతానికి తగ్గించిందని, ఇది రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు సీఎస్కు వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అయిల్ఫెడ్ ఎండీ సురేందర్ పాల్గొన్నారు.
హైదరాబాద్లో ఆయిల్పామ్ బిజినెస్ సమ్మిట్
ఆయిల్పామ్ సాగు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాద్లో కీలక సదస్సు జరగనున్నది. ‘ఆయిల్పామ్ బిజినెస్ సమ్మిట్’ పేరిట నవంబర్ 18న ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆయిల్పామ్ సాగుపై తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా దృష్టి సారించడం, సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరగడంతో ఈ సదస్సును ఇక్కడే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశమున్నది. దేశవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంపు, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పాలసీని ప్రవేశపెట్టి ఆయిల్పామ్ పంటకు మద్దతుధర కల్పించడం, రైతులకు సబ్సిడీలు పెంచడంపై కీలక నిర్ణయాలు తీసుకొన్న విషయం తెలిసిందే. వీటిని ఎలా అమలు చేయాలన్న దానిపై కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు.