రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదంటూ 1992లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలా? వద్దా? అనే విషయమై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. దీనిపై అభిప్రాయాలను తెలుపవలసిందిగా ఇప్పటికే రాష్ర్టాలను అత్యున్నత న్యాయస్థానం కోరింది. దీంతో రిజర్వేషన్ల పరిమితి అంశం దేశవ్యాప్తంగా చర్చనీయం అవుతున్నది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల విషయంలో చట్టసభల పాత్ర, కోర్టు తీర్పులు, చట్టసవరణలు ప్రాతిపదికగా భిన్నవాదనలు ముందుకు వస్తున్నాయి. మారిన సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో యాభై శాతం హద్దును దాటాల్సిందేనని కొన్ని వర్గాలు కోరుతుండగా, అది రాజ్యాంగంలోని సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమనే వాదనలూ వినిపిస్తున్న వారున్నారు. రిజర్వేషన్ల అంశం తెరమీదికి వచ్చినప్పుడల్లా రాజ్యాంగం పునాదిగానే చర్చంతా జరుగుతుండటం విశేషం.
మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది. దీంతో రిజర్వేషన్ల కోటా యాభై శాతాన్ని మించుతున్నదని, దాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం రాష్ర్టాల అభిప్రాయాన్ని కోరింది. దీంతో మొత్తం రిజర్వేషన్లపై పరిమితులు విధించిన ఇందిరాసాహ్నీ మండల్ తీర్పు వాదనలకు కేంద్రబిందువు అవుతున్నది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చసాగింది. రిజర్వేషన్ల పరిధిని, దాని ఆవశ్యకతను తేల్చాల్సింది కోర్టు, న్యాయమూర్తుల సంఖ్య కాదు, పార్లమెంటు మాత్రమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు చేసిన నిర్ణయంతో యాభై శాతం దాటింది కదా! అని కోటాను వ్యతిరేకిస్తున్నవారిని న్యాయస్థానం ప్రశ్నించటం గమనార్హం.
సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ఏర్పాటే రిజర్వేషన్ అని రాజ్యాంగంలో చెప్పుకొన్నాం. కాలానుగుణంగా సమాజంలో వస్తున్న మార్పులు, ప్రత్యేక సమూహాల డిమాండ్ల నేపథ్యంలో రిజర్వేషన్ల కల్పన సమస్య పదే పదే ముందుకు వస్తున్నది. వెనుకబడిన వర్గాలను గుర్తించే అధికారం రాజ్యాంగం రాష్ర్టాలకు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆయా రాష్ర్టాలకు రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు ఉన్నది. ఇప్పటికే తమిళనాడులో యాభై శాతానికి మించి రిజర్వేషన్లున్నాయి. సాంఘికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అన్నప్పుడల్లా యాభై శాతం పరిమితి ముందు పెట్టి అడ్డుకోవాలనుకోవటం సామాజిక న్యాయానికి భంగకరం. సాంఘిక,ఆర్థిక పరిస్థితుల ప్రత్యేక అవసరాల్లో కొన్ని సామాజిక సమూహాలకు రిజర్వేషన్ల కల్పన సామాజిక అవసరం.