pv narasimha rao
వినయ్ సీతాపతి రాసిన ‘నరసింహుడు’ పుస్తకంలోని ‘సగం కాలిన శవం’ అధ్యాయం నుంచి సంక్షిప్తంగా..
23. 12. 2004
దివంగత మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలో ప్రత్యేకంగా విశాల ప్రాంతాలతో భారీ స్మారకాలు నిర్మించారు. కానీ దేశాన్ని కాపాడిన మన పీవీని అందరిలో ఒకరిగా కలిపేశారు. ప్రత్యేక స్మారక స్థలాలు వద్దని నిర్ణయం తీసుకునే నాటికన్నా ఎంతో ముందు మరణించిన శిఖరప్రాయుడైన పీవీని చిన్నవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పీవీ దక్షిణాది నాయకుడు, తెలుగువాడు, తెలంగాణ వాడు కావడమే ఈ అన్యాయానికి కారణమా అని అనుమానించేలా ఈ వివక్ష ఉంది. పీవీ మరణించిన రోజు ఏం జరిగింది? దశాబ్దాలపాటు ఆయన సేవ చేసిన పార్టీ, కుటుంబం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ పీవీకి ఇచ్చిన గౌరవం ఏమిటి.. ప్రత్యేక వ్యాసం..
మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీలోని మోతీలాల్ రోడ్డులో తొమ్మిదో నంబరు ఇంటిముందు ఎయిమ్స్ అంబులెన్స్ వచ్చిఆగింది. అందులోంచి తెల్లటి ధోతి, సిల్కులాల్చీ ధరించి వున్న ఒక మృతదేహాన్ని దించి, ఇంట్లోకి చేర్చారు.1991 నుంచి 1996 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశపు కీర్తిబావుటాని ప్రపంచపటంలో సమున్నత స్థానాలకు తీసుకువెళ్లిన రాజనీతివేత్త పాములపర్తి వేంకట నరసింహారావుది ఆ పార్థివ శరీరం. 23 ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎయిమ్స్లో తుదిశ్వాస తీసుకుంటే, ఆ శరీరానికి అందమైన వస్ర్తాలు కట్టి, మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో నివాస గృహానికి చేర్చారు.
బంధువులు కానివాళ్లలో- ముప్ఫై ఏళ్లకు పైగా పి.వి.కి సన్నిహితుడైన- చంద్రస్వామి ముందుగా అక్కడకు చేరుకున్నాడు. రాజకీయ నాయకుల రాక మొదలైంది. (శవ) రాజకీయం కూడా మొదలైంది. హోంమంత్రి శివరాజ్పాటిల్.. పి.వి. చిన్న కొడుకు ప్రభాకర్ దగ్గరికి వచ్చారు. ‘నాన్నగారి అంత్యక్రియలు హైదరాబాద్లో జరగాలి ప్రభాకర్’ అన్నారు పాటిల్. నిశ్చేష్టుడయ్యాడు ప్రభాకర్. ‘అలా ఎలా? నాన్నగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినవారు. అంత్యక్రియలు ఇక్కడే జరగడం న్యాయం కదా!’ ఏడుపు దిగమింగుకుంటూ ప్రభాకర్ అన్నారు. కుటుంబసభ్యులంతా అదే కోరుతున్నాం అన్నారు. సోనియాగాంధీకి విశ్వాసపాత్రుల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ వచ్చారు. అతను కూడా ‘హితవు’ చెప్పడం ప్రారంభించారు. గంట తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి నుంచి ప్రభాకర్కి ఫోన్ కాల్ వచ్చింది.
‘ప్రభాకర్, జరిగినదానికి చాలా బాధగా ఉంది. నేనిప్పుడు అనంతపురంలో ఉన్నాను, సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటాను. నాన్నగారికి హైదరాబాద్లో చరిత్రాత్మక రీతిలో అంత్యక్రియలు జరిపిద్దాం. నా మాట నమ్మండి.’
సూర్యాస్తమయ సమయానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చారు. వెనకాలే ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ. వాళ్లు పూలతో అలంకరించబడిన పి.వి. దేహాన్ని చూశారు.
ప్రధానమంత్రి అప్పుడు ప్రభాకర్ని పక్కకు పిలిచి అడిగారు, ‘అంత్యక్రియల విషయంలో మీరేమనుకున్నారు?.. మా వాళ్లంతా హైదరాబాదులో జరగాలనుకుంటున్నారు..’‘అదేంటి సార్! ఢిల్లీ నాన్నగారి కర్మభూమి కదా! కొంచెం మీరే మీ మంత్రివర్గానికి చెప్పి ఒప్పించవచ్చు కదా!’ అంతటి బాధలోనూ నిర్మొహమాటంగా చెప్పారు ప్రభాకర్.
డాక్టర్ రాజశేఖరరెడ్డి ఢిల్లీ చేరుకుని పి.వి.కి శ్రద్ధాంజలి ఘటించారు. ‘నన్ను విశ్వసించండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మనది. హైదరాబాద్లో అంతిమయాత్ర ఘనంగా చేద్దాం..’ అని చెప్పి వెళ్లారు. పి.వి. కుమార్తె వాణిదేవి మాటల్లో.. ‘ఆ రోజు మా కుటుంబాన్ని ఒప్పించటంలో వైఎస్ కీలకపాత్ర పోషించారు.’
పి.వి. మృతదేహాన్ని భారత జాతీయపతాకంతో అలంకరించారు. సైనికాధికారుల వాహనాలు వెంట రాగా, నిదానంగా ఒక ఊరేగింపులో ఎయిర్పోర్టుకు తీసుకువెళ్లారు. దారిలో అక్బర్రోడ్డులో.. సోనియాగాంధీ ఇంటిపక్కనున్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాగానే ఊరేగింపు దాదాపు నిలిచిపోయింది.
పి.వి. నాయకత్వంలో ఒక వెలుగు వెలిగిన ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గేట్లు మూసి ఉన్నాయి. అక్కడ అనేకమంది సీనియర్ నాయకులున్నారు. ఎవరూ ఆ గేట్లు తెరిచే ధైర్యం చేయలేకపోయారు. ఒక్కసారి ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. పి.వి. మృతదేహం ఉన్న వాహనం ఆ అక్బర్ రోడ్డులోనే ఒక పక్కగా ఆగింది. సోనియాగాంధీ రోడ్డుమీదకొచ్చి శ్రద్ధాంజలి ఘటించింది.
ఒక ముప్ఫై నిమిషాల తర్వాత ఊరేగింపు ఎయిర్పోర్టు వైపు బయలుదేరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎఎన్-32 విమానంలో పీవీ దేహాన్ని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు తీసుకొచ్చారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, ప్రధాన కార్యదర్శి, మంత్రివర్గ సభ్యులు వగైరా చాలామంది పివి మృతదేహాన్ని సగౌరవంగా స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. హుస్సేన్సాగర్ ఉత్తరతీరంలో నాలుగెకరాల స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాటుచేశారు. మరునాడు మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కూడా హాజరయ్యారు.
పి.వి. పెద్దకొడుకు రంగారావు తండ్రి చితికి నిప్పంటిస్తూనే భోరున ఏడుస్తూ కూలబడిపోయాడు. తమ్ముళ్లంతా అతన్ని సముదాయించే పనిలో పడ్డారు. ఒకటిరెండు గంటల తర్వాత ప్రముఖులంతా ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. చితిపై పి.వి. పార్థివ దేహం కాలుతూనే ఉంది.
అకస్మాత్తుగా రాత్రి బయటకు వచ్చిన వార్త- ‘సగం కాలిన శరీరంతో చితిమంటలు ఆరిపోయిఉన్నాయి. అక్కడ పట్టించుకునే నాథుడెవరూ లేరు’ అని. పి.వి.కి సన్నిహితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్ ఈ వార్తపై విభేదించారు. ‘ఆయన దేహం సగంకాలిన స్థితిలో వదిలివేయబడింది అన్నది నిజంకాదు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనబడింది. ప్రజల మనస్సులో అదే ఉండిపోయింది.. ఏమైనా ఆయన మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాదుకు పంపించారనీ, ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే.’ ప్రసాద్ మాటల్లోచెప్పాలంటే, పి.వి. శరీరం సగమే కాలిందన్న భావన ఆయనకు జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి సూచిక మాత్రమే.
కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు చనిపోయినా వాళ్ల దేహాల్ని పార్టీ కార్యాలయ ఆవరణలో ఉంచడం, అక్కడికి సామాన్య కార్యకర్తలు వచ్చి శ్రద్ధాంజలి ఘటించడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ ఈసారి అలా జరగలేదు.
పి.వి.గారి మిత్రుడొకరు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో చెప్పాడు- ‘ఆ బాడీని పార్టీ ఆఫీసులోకి తీసుకెళ్తే మంచిది కదా!’ ‘ఆ గేట్లుతెరుచుకోవు’ అని ముభావంగా చెప్పి ఊరుకున్నాడు ఆ నాయకుడు. ‘ఇది అన్యాయం. గతంలో మాధవరావు సింధియా చనిపోయినప్పుడు ఆయన బాడీని లోపల పెట్టారు. ఇప్పుడేమయింది?’ అని ఆ పి.వి. మిత్రుడు గొణుక్కున్నాడు. అంత్యక్రియలకు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, పి.వి. వల్ల ‘హవాలా’ అవినీతి ఆరోపణల కేసులో ఇరుక్కున్న మాజీ ఉప ప్రధానమంత్రి, బి.జె.పి సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ కూడా హాజరయ్యారు. పి.వి. స్వస్థలం వంగర, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అక్కడకు రాని ప్రముఖుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఒకరు!
మా నాన్న జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్నారు. ప్రపంచం భారత్ను మరచిపోతున్న సమయంలో.. ప్రపంచ చిత్రపటంలో మన దేశాన్ని నిలిపిన మహానుభావుడు ఆయన. దశాబ్దాలపాటు దేశానికి సేవచేసిన వ్యక్తికి ఆ పార్టీ ఇచ్చిన గౌరవం ఏమిటో అందరికీ తెలుసు. ప్రజాహితం కోసం జీవితాన్ని అంకితం చేసిన మనిషికి అటు కాంగ్రెస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి, రావాల్సినంత గుర్తింపుగానీ, ఇవ్వాల్సినంత గౌరవంగానీ లభించలేదన్న బాధ మాత్రం మా కుటుంబంలో, తెలుగు ప్రజల్లో ఉన్నది. కేవలం తెలుగువారైనందుకే దక్షిణాదికి చెందిన తొలి ప్రధాని పీవీని ఆ పార్టీలు పట్టించుకోలేదు. వాటి వైఖరికి భిన్నంగా.. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం గత ఆరేండ్లుగా పీవీకి ఎంతో గౌరవం ఇస్తుండటాన్ని మేము గమనించాం. రాజకీయాలకు అతీతంగా ఎంతో అభిమానంతో శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. తేడా మనకు తెలుస్తున్నది కదా.
భారత ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందని, ఆయనకు సముచిత గౌరవం ఇవ్వలేదనే విమర్శలను బీజేపీ నేత, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో తమకు లాభించేలా అన్వయించుకున్నారు. పీవీ గొప్ప పండితుడని, జ్ఞాన సంపన్నుడని మోదీ కీర్తించారు. అనేక పోరాటాల్లో పాల్గొన్నారని, పరిపాలనాదక్షుడని, కీలక దశలో జాతిని నడిపించారని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో పీవీకి ఢిల్లీలో సముచిత స్మారకాన్ని ఏర్పాటుచేయలేదని, నిజానికి పీవీ భారతరత్నకు అర్హుడనే అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. ఎన్డీయే ప్రభుత్వం ఆ విమర్శల నుంచి లబ్ధి పొందాలని చూసిందే కానీ, ఇంతకాలమైనా చేసిందేమీలేదు. అటల్ బిహారీ వాజపేయి, మదన్మోహన్ మాలవీయ, ప్రణబ్ముఖర్జీ తదితరులకు భారతరత్న ప్రకటించారు గానీ పీవీని పట్టించుకోలేదు. బీజేపీ ఇప్పుడు ఎంతో కీర్తిస్తున్న వల్లభ్భాయ్ పటేల్కు పీవీ హయాంలోనే భారతరత్న ప్రకటించారు. ఆ పటేల్కు భారీ విగ్రహంతో స్మారకాన్ని నిర్మించిన బీజేపీ.. అదే సమయంలో పీవీని మాత్రం విస్మరించడం విస్మయకరం. దక్షిణాది నేతల పట్ల వివక్ష ఉంటుందన్న అభిప్రాయానికి బలమిచ్చేలాగానే ఉంది తప్ప ఆ కాంగ్రెస్ నేతలకు, ఈ బీజేపీ నేతలకు తేడా ఏమీ లేదన్నది స్పష్టమవుతున్నది.