బాలానగర్, మార్చి 25 : బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ నవీన్కుమార్, ఓల్డ్బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్లతో కలిసి హస్మత్పేట చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి వంటావార్పు చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పెంచిన డీజిల్ ధరలకు నిరసనగా ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, కార్పొరేటర్ నర్సింహయాదవ్లు గుర్రపు బగ్గీపై పయనించారు. ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపరీతంగా చమురు ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వానికి ధరలు అదుపు చేయడంలో నియంత్రణ లోపించిందన్నారు. నిరుపేదలందరూ జన్ధన్ ఖాతా తీసుకోవాలని, తీసుకుంటే అందరి ఖాతాలలో రూ. 15లక్షలు నగదు జమ చేస్తానని అప్పట్లో కేంద్రం ప్రకటించిందని ఆరోపించారు. సంవత్సరాలు గడుస్తున్నా జనధన్ ఖాతాదారులకు ఇప్పటి వరకు రూపాయి కూడా వేయలేదని పేర్కొన్నారు. తప్పుడు వాగ్ధానాలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ముందువరుసలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్గౌడ్, సయ్యద్ ఎజాజ్, కర్రె జంగయ్య, కర్రె లావణ్య, మక్కల నర్సింగ్, హరినాథ్, నర్సింగ్రావు, యాదగిరి, ఖదీర్, పోచయ్య, మట్టి శ్రీను, రాజుగౌడ్, ఉదయ్, లలిత, దుర్గ, సరోజలతో పాటు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.