మనోహరాబాద్, జూలై 16 : మనోహరాబాద్ మండలంలోని పర్కిబండ, మనోహరాబాద్ పరిధిలోని అటవీశాఖ భూముల్లో నూతనంగా నిర్మిస్తున్న అర్బన్ ఆక్సిజన్ పార్కులను మెదక్ కలెక్టర్ హరీశ్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. పార్కుల్లోని వాకింగ్ ట్రాక్లు, యోగా షెడ్లు, సిట్టింగ్ టేబుల్, వాచింగ్ టవర్లను పరిశీలించి హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఆక్సిజన్ పార్కులో నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాకింగ్ట్రాక్లను, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పిచ్చిమొక్కలను తొలగించి, చెత్తచెదారం లేకుండా చూడాలన్నారు. వాకింగ్ ట్రాక్లను సరిచేయాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటాలన్నారు. నెలాఖరులోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్వో జ్ఞానేశ్వర్, హెచ్ఎండీఏ రేంజ్ అధికారి మంజుల, ఫారెస్ట్ రేంజ్ అధికారి మోహన్ పాల్గొన్నారు.
వడియారం అర్బన్ పార్కులో కలెక్టర్ సందర్శన
చేగుంట మండల పరిధిలోని వడియారం అర్బన్ పార్కును మెదక్ కలెక్టర్ హరీశ్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. అర్బన్ పార్కులో చేపడుతున్న అభివృద్ధితోపాటు మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. అనంతరం పార్కులో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.