హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకుండా చేసే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రొటోకాల్ (అంటువ్యాధి నియంత్రణ పద్ధతులు)ను మరింత మెరుగుపరిచేందుకు అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సాయం చేయనున్నది. త్వరలో సీడీసీ ప్రతినిధుల బృందం రాష్ర్టానికి రానున్నది. ఈ బృందం సభ్యులు రాష్ట్రంలో కొన్ని దవాఖానలను సందర్శించి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ను ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలాంటి రసాయనాలు వాడాలి? వంటి అంశాలను సిబ్బందికి వివరించనున్నారు. మొదటి విడతగా ఆరుగురు ప్రతినిధుల బృందం నాలుగైదు దవాఖానలకు సేవలు అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్), కాయకల్ప్కు తగినట్టుగా నిర్దేశిత ప్రమాణాలను పెంచుతున్నది. రాష్ట్రంలోని 125 దవాఖానలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్లు వచ్చాయి. ఈ సర్టిఫికెట్ దక్కిన జిల్లా దవాఖానల క్యాటగిరీలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నది. ఇప్పుడు సీడీసీ కూడా సాయం చేస్తుండటంతో ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.