ఎండాకాలం దాదాపుగా వచ్చేసినట్టే. వేసవి వేడితో పాటు కూల్డ్రింక్స్ వినియోగం కూడా పెరుగుతుంది. చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండే శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్కు పెరుగుతుందని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. ఇలాంటి షుగరీ డ్రింక్స్ వల్ల అధిక బరువు, స్థూలకాయ సమస్యలను ఇప్పటికే ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు క్యాన్సర్ కూడా రావొచ్చంటున్నది ఫ్రాన్స్లో జరిగిన ఈ అధ్యయనం. దాదాపు లక్షమందిపై 9 ఏండ్ల పాటు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వయసు, స్త్రీ పురుష భేదం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక శ్రమ లేకపోవడం, స్మోకింగ్ లాంటి రిస్క్ కారకాలలో ఇది కూడా చేరింది. ఎక్కువ మోతాదులో షుగరీ డ్రింక్స్ తీసుకున్నవాళ్లలో 693 మందికి ఏదో ఒక క్యాన్సర్ అవకాశం ఉన్నట్టు ఈ అధ్యయనంలో నిర్ధారణ అయింది. అందుకే, రెడీమేడ్గా దొరికే డ్రింక్స్, బయట అమ్మే పండ్ల రసాల కన్నా ఇంట్లోనే చక్కెర కలపకుండా పండ్లరసం తీసుకోవడం మంచిదంటున్నారు.