ధీరావత్ సుధాకర్ నాయక్.. ఎంటెక్ చదివాడు. ఉద్యానవన శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో సీనియర్ అసి స్టెంట్గా పనిచేశాడు. కానీ, వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం వదిలి, సొంతూరికి వచ్చేశాడు. వినూత్న పంటలు పండిస్తూ, తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ నాయక్ది వ్యవసాయ కుటుంబం. ఉన్నత చదువులు, ఉద్యోగాలు.. ఏవీ తనకు సంతృప్తినివ్వలేదు. దీంతో స్వగ్రామానికి వచ్చి, సేంద్రియ సాగును మొదలుపెట్టాడు. అందరిలా కాకుండా బ్రొకోలీ, క్యాప్సికం, స్వీట్ కార్న్ లాంటి వినూత్న పంటలు సాగు చేస్తున్నాడు. ఆయా పంటలపై సాటి రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు.
నగరాల్లో ఎక్కువగా ఉపయోగించే బ్రొకోలీని 20 గుంటల్లో సాగు చేశాడు. స్థానిక వాతావరణం అనుకూలించదని ఎంతమంది చెప్పినా పట్టించుకోలేదు. 20 రోజులు నారు పెరిగిన తర్వాత మొక్కలను నాటించాడు. డ్రిప్ద్వారా సాగునీరు అందించి, అద్భుతమైన దిగుబడిని సాధించాడు. అయితే, మార్కెటింగ్లో అనుభవం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు పడ్డాడు. తొలి రెండు విడుతల్లో 23 క్వింటాళ్ల దిగుబడిని సాధించి, రూ.70వేల దాకా ఆదాయం పొందాడు. బ్రొకోలీమీద పల్లెల్లోనూ అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కొంత దిగుబడిని గ్రామంలో ఉచితంగా పంచిపెట్టాడు.
తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలు పండిస్తున్నాడు సుధాకర్. రెండు ఎకరాల్లో గ్రీన్ క్యాప్సికంతోపాటు తేజా రకం మిర్చి, సాధారణ మిర్చి సాగు చేస్తున్నాడు. మరో ఎకరంలో స్వీట్కార్న్, అంతర పంటగా పుచ్చకాయలు, మొరం గడ్డ లాంటివి సాగు చేస్తున్నాడు. మిగతా పొలంలో వరితోపాటు మినుము, వేరుశనగ, కంది, టమాట, వంకాయలను సేంద్రియ విధానంలో పండిస్తున్నాడు. వరి మినహా అన్ని పంటలకూ డ్రిప్తోనే నీటిని అందిస్తున్నాడు. గతేడాది ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో పుచ్చకాయలను సాగు చేశాడు. మూడు నెలల్లోనే పంట చేతికి రాగా, స్వయంగా మార్కెటింగ్ చేసుకున్నాడు. అంచనాలకు మించి రూ.లక్షన్నర దాకా ఆర్జించాడు.
సుధాకర్ నాయక్ పూర్తిగా సేంద్రియ సాగుకే మొగ్గు చూపుతున్నాడు. మిర్చి సాగులో బొబ్బర, ముడత తెగుళ్ల నివారణకు స్వయంగా సేంద్రియ మందులను తయారు చేశాడు. ఇందుకు రైతుల అనుభవాలతోపాటు సామాజిక మాధ్యమాల సాయం తీసుకున్నాడు. ఉమ్మెత్త, జిల్లేడు, పొగాకు, పసుపు, గోమూత్రం, వేపనూనెల మిశ్రమంతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ, చీడపీడల నుంచి పంటలను కాపాడుతున్నాడు.
వ్యవసాయమే నాకు సంతృప్తినిస్తున్నది. ఒకరి కింద ఉద్యోగం చేయడం వద్దనుకున్నా. నాకున్న ఐదెకరాల్లో మా నాన్నతో కలిసి పని చేయాలనుకున్నా. ఎప్పుడూ వేసే పంటలే కాకుండా, వెరైటీగా సాగు చేయాలనే ఉద్దేశంతో బ్రొకోలీ పంటను ఎంచుకున్నాను. మంచి దిగుబడి వచ్చింది. కానీ, మార్కెట్పై అవగాహన లేకపోవడంతో ఆదాయం తగ్గింది. రైతులంతా ఆర్గానిక్ సాగు చేయాలన్నదే నా లక్ష్యం. మా గ్రామంలో సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నా.
డి. సుధాకర్నాయక్
మోటుపల్లి
రామానుజా చార్యులు