‘పెద్ద సినిమాలతో పాటు వినూత్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కిస్తుండేవారు. నేటితరం దర్శకుల్లో మారుతి ఆ పంథాను అనుసరిస్తున్నాడు’ అని అన్నారు గోపీచంద్. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘మంచిరోజులు వచ్చాయి’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంతోష్శోభన్, మెహరీన్ జంటగా నటించారు. మారుతి దర్శకుడు. యూవీ సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాతలు. గోపీచంద్ మాట్లాడుతూ ‘సినిమాకు సంబంధించి టైటిల్తో పాటు ప్రతి అంశంలో పాజిటివిటీ కనిపిస్తున్నది. అందరిని నవ్వించే సినిమా ఇది. ఆ గ్యారెంటీ నేను ఇస్తున్నా’ అని తెలిపారు. మారుతి మాట్లాడుతూ ‘కరోనా మహమ్మారి సమయంలో అందరిలో తెలియని భయాలు మొదలయ్యాయి. ఆ భయం అనే పాయింట్ను తీసుకొని సినిమా చేశా. ఇరవై రోజుల్లో కథ రాసి ముప్పై రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం’ చెప్పారు. సామాజిక సందేశాల్ని వినోదాత్మక పంథాలో అర్థవంతంగా మారుతి తెరపై ఆవిష్కరిస్తుంటారని, చిన్న చిత్రాల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యతను అగ్రహీరోలు స్వీకరించాలని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. హీరోగా ఈ స్థాయికి చేరుకోవడానికి తాను ఎన్నో కష్టాలు అనుభవించానని సంతోష్శోభన్ అన్నారు.