న్యూఢిల్లీ: జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర భావోద్వేగానికి లోనయ్యారు. జీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏడ్చేశారు. జీ కంపెనీలో వాటా కలిగి ఉన్న ఇన్వెస్కో, ఏఎఫ్ఐ గ్లోబల్ ఫండ్ సంస్థలు అక్రమ రీతిలో జీ గ్రూపును టేకోవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సుబాష్ చంద్ర ఆరోపించారు.ఇన్వెస్కో చాలా రహస్య పద్ధతిలో తాను స్థాపించిన జీ కంపెనీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుట్లు పేర్కొన్నారు. జీ గ్రూపు స్థాపించిన తొలి రోజుల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పారు. పొరపాట్లు చేసినా, సద్విమర్శలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఒకవేళ ఇన్వెస్కో తమ కంపెనీ షేర్లను పొందాలనుకుంటే, అప్పుడు ఓపెన్ విధానంలో ఆ ప్రక్రియ సాగాలన్నారు. జీ గ్రూపులో ఇన్వెస్కోకు 17 శాతం వాటా ఉన్నది. కానీ తన గ్రూపును సోనీ సంస్థకు అప్పగించేందుకు సుభాష్ చంద్ర ప్రయత్నించారు. అయితే ఇన్వెస్కో ఇప్పుడు జీ మొత్తాన్ని స్వంతం చేసుకోవాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్ర ఆ కంపెనీ తీరుపై ఆరోపణలు చేశారు. ఇన్వెస్కో, ఏఎఫ్ఐ ఉద్దేశాలను కార్పొరేట్ అఫైర్స్ శాఖ దర్యాప్తు చేయాలని సుభాస్ డిమాండ్ చేశారు. టేకోవర్పై షేర్హోల్డర్లు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలన్నారు.