న్యూఢిల్లీ : భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 చానళ్లను గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ యూట్యూబ్ నిషేధించింది. ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు యూట్యూబ్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. ఐటీ చట్టం 2021 ప్రకారం చర్యలు తీసుకున్నది. వీటితో పాటు రెండు వెబ్సైట్లను సైతం నిషేధించారు.
ఈ చానల్స్, వెబ్సైట్ కార్యకలాపాలు పాక్ నుంచి కొనసాగుతున్నాయి. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, టెలీకాం శాఖ అధికారుల ప్రకారం.. యూట్యూబ్ చానల్స్, వెబ్సైట్లు పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహాయంతో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ చానల్స్లో ‘నయా పాకిస్తాన్’ పేరుతో ఒకటి ఉందని, ఇందులో రెండు మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ చానల్స్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, అయోధ్య నుంచి కశ్మీర్ వరకు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.