Indian Food | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో 26 భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. వాటిలో ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకుల అధ్యయనంలో పర్యావరణంపై ఆహార పదార్థాల ప్రభావం వెలుగు చూసిందట. ఆహార ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో రకరకాల జీవజాతులు ప్రభావితం అవుతాయని చెప్తున్నారు. వ్యవసాయం చేసే ప్రదేశాల్లో క్షీరదాలు, పక్షులు, ఉభయ చరాలపై పడే ప్రభావంపై పరిశోధకులు అంచనా వేశారు. బియ్యం, పప్పు ధాన్యాలతో కూడిన పదార్థాల వల్ల జీవ వైవిధ్యానికి అధిక ముప్పని పరిశోధనలో తేల్చారు. భారత్లో బియ్యం, పప్పు పంటల సాగుకు తరచుగా భూమి మార్పిడి అవసరమని, దీనివల్ల అనేక జీవజాతులు ఆవాసాలను కోల్పోతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు.