Police | లక్నో : అతనో యంగ్ పోలీసు కానిస్టేబుల్. ప్రతి కేసులోనూ చురుకుగా వ్యవహరిస్తూ.. తన కంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ఇక ఫిబ్రవరిలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు కూడా నిమగ్నమయ్యారు. కానీ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆ పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కన్నౌజ్ జిల్లాకు చెందిన కరుడుగట్టిన నేరస్థుడు అశోక్ యాదవ్పై 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే ఓ హత్య కేసులో యాదవ్ను అరెస్టు చేసేందుకు నలుగురు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసులను గమనించిన అశోక్, అతని కుమారుడు అభయ్ కలిసి కాల్పులు జరిపారు. తండ్రీకుమారుడి కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో సచిన్ రాథీ అనే కానిస్టేబుల్ తొడకు బుల్లెట్ గాయమైంది.
అశోక్ యాదవ్ కాల్పులు జరుపుతుండటంతో.. మరింత మంది పోలీసులను అక్కడికి తరలించారు. గంట పాటు పోలీసులకు, అశోక్కు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం అశోక్, అభయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అశోక్ కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ సచిన్ రాథీని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో నిన్న అర్ధరాత్రి సచిన్ ప్రాణాలు కోల్పోయాడు.
సచిన్ రాథీ ముజఫర్ నగర్కు చెందిన యువకుడు. 2019లో పోలీసు డిపార్ట్మెంట్లో చేరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన మహిళా కానిస్టేబుల్తో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఉదయం సచిన్ అంత్యక్రియలు నిర్వహించారు.