లక్నో : ఉత్తర ప్రదేశ్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఎన్నికల్లో బంపర్ విజయం సాధించగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ బెర్తుల విషయంపై ఢిల్లీ స్థాయిలో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. యోగి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో సమావేశం అయ్యారు. అయితే, ఈ సారి గతమంత్రివర్గంలో మంత్రులుగా పని చేసిన పలువురిని మార్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. కొత్త కేబినెట్లో అపర్ణా యాదవ్, పంకజ్ సింగ్, శలభ్ మణి త్రిపాఠి, అసీమ్, అరుణ్, రాజేశ్వర్ సింగ్, దయాశంకర్ సింగ్ మంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తున్నది. అపర్ణా యాదవ్ ములాయం సింగ్ కోడలు. యూపీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే, అపర్ణ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. త్వరలో జరుగనున్న శాసన మండలి ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. మరో వైపు నోయిడా నుంచి పంకజ్ సింగ్ ఎస్పీ అభ్యర్థిపై 1.81లక్షల ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. ఇంతకు ముందు ఆదిత్యనాథ్కు మీడియా సలహాదారుగా పని చేసిన శలభ్ మణి త్రిపాఠి డియోరి స్థానం నుంచి 40వేల మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న ఐపీఎస్ అసిమ్ అరుణ్ సైతం కన్నౌజ్ నుంచి బీజేపీ టికెట్పై గెలుపొందారు. ఇంతకు ముందు మంత్రివర్గంలో పని చేసిన కొందరిని ఈ సారి కొనసాగించనున్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రులను మండలికి పంపేది లేదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఈ సారి 11 మంత్రులు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో వారంతా ప్రస్తుతం బెర్తులు కోల్పోయినట్లయింది. ప్రస్తుతం కొత్త వారిని తీసుకునే విషయంపైనే పార్టీలో చర్చ సాగుతున్నది. ముఖ్యంగా కేశవ్ ప్రసాద్ మౌర్యకు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతున్నది. డెప్యూటీ సీఎంగా పని చేసిన మౌర్య.. సీరతు నుంచి పోటీ చేసిన ఆయన.. ఎస్పీ అభ్యర్థి పల్లవి పటేల్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దింపే అభ్యర్థులపై పార్టీ కోర్ గ్రూప్ ఇవాళ లక్నోలో చర్చించనున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభం కానున్నది.