Yogi Adityanath : తెలంగాణ, ఏపీ, కర్ణాటకలలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు స్కీం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లోనూ అమలులోకి రానుంది. ఈ మేరకు ఉత్తర ప్రభుత్వ క్యాబినెట్ ఈ పథకానికి మంగళవారం ఆమోదం తెలిపింది. అయితే, ఇది 60 సంవత్సరాలు దాటిన మహిళలకు మాత్రమే. లోకమాత అహిల్యాబాయ్ మాతృశక్తి యోజన పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని యోగి ఆదిథ్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నట్లు అందరు మహిళలకు కాకుండా.. 60 సంవత్సరాలు దాటిన మహిళలకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ పథకం జీవితాంతం వర్తిస్తుంది. ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) బస్సులలో ఈ పథకం అమలవుతుంది. ఈ విషయాన్ని యూపీ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఈ పథకం అమలవుతుందన్నారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని కోటి మందికిపైగా మహిళలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అర్హులైన మహిళలు వోటర్ ఐడీ, ఆధార్ సహా వయసును సూచించే ఇతర ప్రభుత్వ, అధికార గుర్తింపు కార్డులను చూపించి ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పథకాన్ని రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ప్రభుత్వం అభివర్ణించింది. వృద్ధులకు ప్రయాణ ఖర్చుల భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు గంగా ఎక్స్ప్రెస్ వేను యూపీలోని హరిద్వార్ వరకు పొడిగించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.10,761 కోట్లు ఖర్చు కానున్నాయి. దీని ద్వారా బిజ్నూర్ నుంచి హరిద్వార్కు రవాణా మెరుగవుతుంది.