లక్నో: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల గడువు మాత్రమే ఉండగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు పూనుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది సభ్యులు ఉండగా.. రాజ్యంగ పరిమితుల ప్రకారం మరో ఏడుగురిని కొత్త చేర్చుకునే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇప్పటికే కొత్తగా మంత్రి పదవులు చేపట్టబోయే వారి పేర్లను ఖరారు చేశారు. అయితే, మంత్రివర్గంలోకి కొత్తగా ఎంతమందిని తీసుకుంటున్నారు..? వారు ఎవరు అనే వివరాలను మాత్రం యూపీ సర్కారు గుట్టుచప్పుడు కాకుండా ఉంచింది.
కానీ, ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన బ్రాహ్మణ సామాజికవర్గ నాయకుడు జితిన్ ప్రసాదకు మంత్రి పదవి ఖరారైనట్లు తెలుస్తున్నది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతున్న నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ను యూపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూపీ నూతన మంత్రివర్గం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే ప్రమాణస్వీకారం కూడా చేసే అవకాశం ఉన్నది.