భువనేశ్వర్/కోల్కతా, మే 25: తూర్పు తీరాన్ని యాస్ తుఫాన్ వణికిస్తున్నది. మంగళవారం సాయంత్రం ఇది అతి తీవ్ర తుఫాన్గా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది మరింత బలపడి బుధవారం తెల్లవారుజామున ఒడిశాలోని భద్రక్ జిల్లా ధమ్రా ఓడరేవు, చాంద్బలి వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆ సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది.
యాస్ తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంత రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుమారు 9 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించింది. ఒడిశా ప్రభుత్వం కూడా 3లక్షలమందికిపైగా తరలించినట్టు అధికారులు తెలిపారు. సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు మంగళవారం రాత్రంతా సచివాలయంలోనే ఉండనున్నట్టు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రకటించారు. మరోవైపు, మంగళవారం ఒడిశా, బెంగాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం కూడా ఈ రెండు రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కాగా, యాస్ తుఫాను ప్రభావంతో బుధ, గురువారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.