ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లబోతోంది. ఆలోపే ప్లేయర్స్ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్లు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన బీసీసీఐ ఉంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో ప్లేయర్స్ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. దీంతో ఎవరికి వాళ్లు వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ప్లేయర్స్ తీసుకోవడం కూడా సులువవుతుంది. అయితే కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ వ్యాక్సిన్కే ప్రాధాన్యత ఇవ్వాలని క్రికెటర్లకు బీసీసీఐ సూచించింది.
దీని వెనుక బలమైన కారణమే ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తోపాటు ఇంగ్లండ్ సిరీస్కు ఎంపికైన ప్లేయర్స్ రెండో డోసు సమయానికి ఇంగ్లండ్లో ఉంటారు. అక్కడ కొవిషీల్డ్ వ్యాక్సినైతే ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. అసలు ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిందే ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతోపాటు ఆస్ట్రాజెనెకా సంస్థ. ఆ వ్యాక్సిన్నే ఇండియాలో కొవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్నారు.
ఇక్కడ కొవాగ్జిన్ తీసుకుంటే రెండో డోసుకు కష్టమవుతుందని, అందుకే కొవిషీల్డ్కే ప్రాధాన్యత ఇవ్వాలని ప్లేయర్స్కు సూచించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. డబ్ల్యూటీసీ ఫైనల్తోపాటు ఇంగ్లండ్ వెళ్లే ప్లేయర్స్ ఈ నెల 25న బబుల్లోకి వెళ్లనున్నారు. ఇక్కడ వారం రోజులు ఉన్న తర్వాత జూన్ 2న ఇంగ్లండ్ వెళ్తారు. అక్కడ 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 25లోపే ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అందరూ ఒక డోసు వ్యాక్సిన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు.