యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటన విషయంలో సిట్ చేసిన ప్రకటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయరా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఈ విషయంపై పార్లమెంట్లో చర్చించరా? అని మమత నిలదీశారు. లఖింపూర్ ఖేరీలో కేంద్రమంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించిన ఘటన ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అని ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీశ్ మిశ్రాపై ఇప్పటికే హత్య, నేరపూరిత కుట్ర లాంటి అభియోగాలు నమోదయ్యాయి. వీటితో పాటు హత్యాయత్నంతో పాటు మరికొన్ని అభియోగాలను కూడా చేర్చుతామని సిట్ బాధ్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ పై వ్యాఖ్యలు చేశారు. ఇక గోవాలో బీజేపీని ఓడించడానికి అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మమత పునరుద్ఘాటించారు. తాను కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచే వచ్చానని, ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని మమత పేర్కొన్నారు.