న్యూఢిల్లీ, మార్చి 7: ఉద్యోగాలకు భూమి కుంభకోణంలో బీహార్ మాజీ సీఎం, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను సీబీఐ మంగళవారం విచారించింది. ఢిల్లీలోని లాలూ కుమార్తె మీసా భారతి నివాసంలో రెండు గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. దీనిపై లాలూ కూతురు రోహిణి ఆచార్య తీవ్రంగా స్పందించారు. ‘నాన్నను నిరంతరాయంగా వేధిస్తున్నారు. ఆయనకు ఏమైనా అయితే నేను ఎవర్నీ వదిలిపెట్టను. ఓర్పుకు ఉన్న హద్దులను పరీక్షిస్తున్నారు. ఇవన్నీ గుర్తుంచుకుంటాను. కాలం చాలా బలమైనది’ అని ట్వీట్ చేశారు. తన కుటుంబం బీజేపీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే సీబీఐ తన కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నదని బీహార్ డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీయాదవ్ తెలిపారు.