అగర్తలా: త్రిపురలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై ఆ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విశ్వహిందూ పరిష్త్కు చెందిన కార్యకర్త కాంచన్ దాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసులు బుక్ చేశారు. సమృద్ధి సకూనియా, స్వర్ణ ఝా అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు చేస్తున్న వార్తల కవరేజీ వివిధ వర్గాల ప్రజల మధ్య మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉన్నదని కాంచన్ దాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో పోలీసులు వారిపై వర్గాల మధ్య మత విధ్వేషాలు రెచ్చగొట్టిన నేరానికి ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 153-ఎ కింద, నేరపూరిత కుట్రకుగాను సెక్షన్ 120 (బీ) కింద కేసులు నమోదు చేశారు.
కాగా, పోలీసులు తమ హోటల్కు వచ్చి తమను బెదిరించారని సదరు మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న హింసాత్మక ఘటలను తాము కవర్ చేస్తున్నామని, ఇది మత ఘర్షణలు రెచ్చగొట్టడం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక పోలీసులు తమను హోటల్ బయటికి వెళ్లనివ్వడం లేదని, రాజధాని అగర్తలాకు వెళ్దామంటే హోటల్ బయట 16 నుంచి 17 మంది పోలీసులను మోహరించారని సమృద్ధి సకూనియా ట్విట్టర్లో ఆరోపించారు. కానీ సకూనియా ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు.
ఎఫ్ఐఆర్లో నమోదైన ఆరోపణల మేరకు తాము త్రిపుర నార్త్ జిల్లాలోని ధర్మానగర్ సబ్-డివిజన్లో నిందితులు ఉన్న హోటల్కు వెళ్లామని, అక్కడి వారి అనుమతి తీసుకుని మాట్లాడామని, ఆ తర్వాత నెల 21న విచారణకు రావాలని నోటిసులు ఇచ్చామని ఓ పోలీస్ అధికారి చెప్పారు. అయితే, ఓ న్యాయవాదిని సంప్రదించి రావడానికి కొంత సమయం కావాలని కోరారని, అందుకు కూడా తాము అంగీకరించామని ఆయన తెలిపారు.