లక్నో: శిక్షణలో భాగంగా విమానం నడిపిన మహిళా ట్రైనీ పైలట్ ల్యాండింగ్ తర్వాత ఇంజిన్ ఆన్లో ఉండగానే కిందకు దిగింది. దీంతో తిరుగుతున్న ప్రొపెల్లర్ ఆమె వెనుక భాగానికి తగలడంతో గాయపడింది. ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (propeller hits Trainee pilot) ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. జూన్ 26న కాన్పూర్లోని చకేరి విమానాశ్రయంలో గార్గ్ ఏవియేషన్కు చెందిన ట్విన్ ఇంజిన్ విమానంలో మహిళా ట్రైనీ పైలట్ రాత్రిపూట శిక్షణ పొందింది. ఆమెతో పాటు ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కూడా అందులో ఉన్నారు.
కాగా, ఆ విమానం ల్యాండింగ్ తర్వాత ఇంజిన్ ఆన్లో ఉండగానే మహిళా ట్రైనీ పైలట్ కిందకు దిగింది. దీంతో తిరుగుతున్న విమానం ప్రొపెల్లర్ ఆమె వీపు భాగానికి తగలడంతో గాయపడింది. ఆ ట్రైనీ పైలట్ను కాన్పూర్లోని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై విచారణ చేపట్టింది. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత ఇన్స్ట్రక్టర్ను ఫ్లైయింగ్ ట్రైనీ విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. అలాగే విచారణ కొనసాగుతున్నంత కాలం ఆ విమానాన్ని వినియోగించకూడదని కూడా ఆదేశించినట్లు డీజీసీఏ పేర్కొంది.