బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించింది. ఒకరు మరణించగా మరో చిన్నారికి కాలిన గాయాలయ్యాయి. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ ముల్బాగల్లో నివసిస్తున్నది. బుధవారం తన ఇద్దరు పిల్లలతో కలిసి సమీపంలోని అంజనాద్రి కొండపైకి వెళ్లింది. అక్కడ వారిద్దరికి నిప్పుపెట్టింది.
కాగా, కొండపై మంటలు, కాలుతున్న వాసనను స్థానికులు గమనించారు. వారు వెంటనే ఆ కొండపైకి వెళ్లారు. నిప్పంటించుకునేందుకు ప్రయత్నించిన మహిళను అడ్డుకున్నారు. పిల్లలకు ఆమె నిప్పుపెట్టిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
మరోవైపు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక చిన్నారి మంటల్లో కాలి చనిపోయినట్లు గుర్తించారు. మరణించిన చిన్నారితోపాటు తీవ్ర కాలిన గాయాలైన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. భర్త వేధింపులు భరించలేక ఆ మహిళ ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.