లక్నో: నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నీటిని పోసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అతడ్ని కొట్టింది. ఆపై టెర్రస్ పైనుంచి కిందకు తోసేసింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో అతడి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. (Woman Pours Boiling Water On Husband) ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 13న ఆశిష్ కుమార్ రాయ్ తన అత్తవారింటికి వెళ్లాడు. అయితే అతడికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య అమృతా రాయ్ అనుమానించింది. దీంతో తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన భర్త మొబైల్ ఫోన్, బైక్ కీ తీసుకుంది. ఆ రోజు అక్కడే ఉండాలని భార్యతోపాటు అత్తింటి వారు పట్టుబట్టారు.
కాగా, మధ్య రాత్రి దాటిన తర్వాత భార్య అమృతా బెడ్ రూమ్ నుంచి బయటకు వెళ్లిందని ఆశిష్ కుమార్ తెలిపాడు. అప్పటికే ఆమె సోదరి నీటిని మరిగించి ఉంచగా నిద్రిస్తున్న తనపై వేడి నీటిని భార్య పోసిందని ఆరోపించాడు. తాను పారిపోయేందుకు ప్రయత్నించగా వారంతా కలిసి తనను కొట్టారని, టెర్రస్ పైనుంచి కిందకు తోశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశిష్ భార్య అమృతాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.