భోపాల్: పొరుగు వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్న ఒక మహిళ తన మూడేండ్ల కుమారుడ్ని చంపింది. (Woman kills son) అనంతరం ఆమెకు పీడ కలలు రావడంతో జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళతోపాటు ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 28న జ్యోతి భర్త ధ్యాన్ సింగ్ ప్లాస్టిక్ పైపుల షాపును ప్రారంభించాడు. ఈ సందర్భంగా పొరుగున ఉండే ఉదయ్ ఇందౌలియాతోపాటు తెలిసిన వారిని ఆహ్వానించాడు.
కాగా, షాపు ప్రారంభ హడావుడిలో అంతా బిజీగా ఉండగా జ్యోతి, ఉదయ్ టెర్రస్ పైకి వెళ్లారు. వివాహేతర సంబంధం ఉన్న వారిద్దరూ అక్కడ అనుచిత స్థితిలో ఉన్నారు. ఇంతలో జ్యోతి మూడేండ్ల కుమారుడు అక్కడకు వచ్చాడు. ఉదయ్తో తనను చూసిన ఆ బాలుడు ఈ విషయాన్ని భర్తకు చెబుతాడేమోనని జ్యోతి భయపడింది. కుమారుడ్ని టెర్రెస్ పైనుంచి కిందకు తోసేసింది. ప్రమాదవశత్తూ పడిపోయినట్లు అందరిని నమ్మించింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరునాడు మరణించాడు.
మరోవైపు కుమారుడ్ని టెర్రస్ పైనుంచి తోసి చంపిన జ్యోతికి నాటి నుంచి పీడ కలలు రాసాగాయి. దీంతో ఆమె జరిగిన విషయాన్ని భర్త ధ్యాన్ సింగ్కు చెప్పింది. భార్య చెప్పిన విషయాన్ని అతడు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దీనిని పోలీసులకు వినిపించి భార్యపై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు జ్యోతి, ఆమె ప్రియుడు ఉదయ్ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.