లక్నో: బ్లడ్ రిపోర్ట్ లేదన్న కారణంతో పురిటి నొప్పులు పడుతున్న నిండు గర్భిణీని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆసుపత్రి బయటే ఆ మహిళ ప్రసవించింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఈ సంఘటన జరిగింది. కల్పన అనే గర్భిణీకి తొమ్మిది నెలలు నిండాయి. గురువారం నొప్పులు రావడంతో కాన్పు కోసం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి భర్త తీసుకెళ్లాడు. అయితే బ్లడ్ రిపోర్ట్లు లేవన్న కారణంతో ఆ మహిళను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునేందుకు అక్కడి వైద్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆసుపత్రి బయటే ఆ మహిళ ప్రసవించింది.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రయత్నించారు. ధృవీకరణ ప్రతాలైన ఆధార్ వంటివి ఆ మహిళను అడిగినట్లు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ షెల్లీ సింగ్ తెలిపారు. అవి లేవని చెప్పడంతో కాన్పు రూమ్కు వెళ్లాలని చెప్పామన్నారు. అయితే ఆ మహిళ ఆసుపత్రి బయటకు వెళ్లిందని, అక్కడ ప్రసవించిందని అన్నారు. అనంతరం ఆ మహిళ, శిశువును మెటర్నరీ వార్డ్కు తరలించినప్పటికీ అక్కడ ఉండేందుకు ఆమె నిరాకరించిందని చెప్పారు.
మరోవైపు ఈ సంఘటనపై దర్యాప్తు కోసం వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హత్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజిత్ సింగ్ తెలిపారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ బృందాన్ని కోరినట్లు చెప్పారు. దర్యాప్తు పూర్తైన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.