జైపూర్: రాజస్థాన్లోని మేర్టా మున్సిపల్ (Merta Municipality) సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్పై (Municipal Chairman) ఓ మహిళా కౌన్సిలర్ చెప్పులు విసరగా, మరో కౌన్సిలర్ పూల దండతో దాడిచేశాడు. 2024-25 నగర బడ్జెట్ ఆమోదం కోసం చైర్మన్ గౌతమ్ తాక్ (Gautam Tak) అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గౌతమ్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో బీజేపీ (BJP) మద్దతుతో గెలిచిన శోభా లహోటీ అనే మహిళా కౌన్సిలర్ చైర్మన్పై చెప్పులు (Slippers) విసిరారు. బీజేపీకి చెందిన మరో కౌన్సిలర్.. గౌతమ్ వద్దకు దూసుకెళ్లి పూల దండతో దాడిచేశాడు.
అంతటితో ఆగని సభ్యులు తమ ముందున్న ఫైళ్లను ఆయనపై విసిరారు. చైర్మన్పై భౌతికదాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమనిగింది. అనంతరం సమావేశం వాయిదాపడింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లక్ష్మణ్ రామ్ సమక్షంలోనే ఇదంతా జరగడం విశేషం. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.