న్యూఢిల్లీ: కష్టపడి సంపాదించుకునేవాళ్లు కష్టపడి సంపాదించుకుంటుంటే.. కష్టం చేతగాని వాళ్లు మాత్రం మందిని ముంచి సొమ్ము చేసుకుంటున్నారు. రకరకాల ఆర్థిక నేరాలతో అమాయకుల నెత్తిన టోపీ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట ఈ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
హర్యానా రాష్ట్రం గుర్గావ్లోని ఓ కాలనీకి సరళ గార్గ్ అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఇరుగుపొరుగుతో పరిచయాలు పెంచుకుంది. ఆ పరిచయాలను ఆసరాగా చేసుకుని వారికి అధిక వడ్డీల ఆశచూపి భారీగా వసూళ్లు చేసింది. తరచూ తన ఇంట్లో కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ అందరికీ తనపై నమ్మకం కలిగేలా చేసింది.
అయితే ఈ మధ్య కాలంలో తనకు డబ్బులు ఇచ్చిన వాళ్లకు అసలుగానీ, వడ్డీలుగానీ తిరిగి ఇవ్వకపోవడంతో ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆమె కుటుంబంతో సహా కాలనీ నుంచి పారిపోయింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అందరూ కలిసి రూ.1,01,77,333 మునిగినట్లు గుర్తించిన పోలీసులు నిందితురాలి కోసం గాలించి అదుపులోకి తీసుకున్నారు.