లక్నో: గాజు సీసాలతో టైమ్ బాంబ్స్ చేయాలని ఒక వ్యక్తిని మహిళ కోరింది. (Bottle Time Bombs) వాటిని తయారు చేసిన అతడు ఆమెకు అందజేసేందుకు బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని ప్రశ్నించిన తర్వాత ఆ మహిళను కూడా అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇమ్రానా అనే మహిళ గాజు సీసాలతో నాలుగు టైమ్ బాంబులు తయారు చేయాలని తనకు తెలిసిన జావేద్ను కోరింది. మొత్తం రూ.40,000 ఇస్తానని చెప్పిన ఆమె అడ్వాన్స్గా రూ.10,000 చెల్లించింది.
కాగా, గాజు బాటిళ్లలో పేలుడు పదార్థాలు, ఇనుప ముక్కలు, టైమర్ అమర్చిన జావేద్ నాలుగు బాంబులు తయారు చేశాడు. శుక్రవారం వాటిని ఇమ్రానాకు ఇచ్చేందుకు ఆమె వద్దకు బయలుదేరాడు. అయితే దీని గురించి నిఘా సమాచారం అందున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీటీఎఫ్) పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. జావేద్ వద్ద ఉన్న నాలుగు బాటిల్స్ టైమ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా ఇమ్రానా తయారు చేయమని చెప్పిందన్నాడు. పటాకులు తయారు చేసే బంధువు వద్ద ఉండి బాంబు తయారీ గురించి తెలుసుకున్నానని, యూట్యూబ్ చూసి వాటిని తయారు చేసినట్లు చెప్పాడు.
మరోవైపు మీరట్కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం ముజఫర్నగర్ జిల్లాకు చెందిన ఇమ్రానాను అరెస్ట్ చేశారు. బాటిల్స్ టైమ్ బాంబులు ఎందుకు తయారు చేయించిందో అన్నదానిపై ప్రశ్నించారు. 2013లో జరిగిన మత అల్లర్లలో తన ఇల్లు ధ్వంసమైందని ఆమె తెలిపింది. ఏదైనా హింస, అల్లర్లు వంటివి మళ్లీ జరిగితే రక్షణ కోసం ఆ బాంబులను తయారు చేయించినట్లు చెప్పింది. గతంలో కూడా అలాంటి బాంబులను తన ఇంట్లో ఉంచానని, ఆ తర్వాత వాటిని ఇతరులకు ఇచ్చినట్లు వెల్లడించింది.
కాగా, అరెస్ట్ చేసిన జావేద్, ఇమ్రానాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నాలుగు బాటిల్స్ టైమ్ బాంబులను బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్కు అప్పగించినట్లు చెప్పారు. న్యాజుపురా అటవీ ప్రాంతంలో వాటిని నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు.