కోల్కతా: ఈ నెల 22న ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామమందిరంలో రాముడి విగ్రహాల ప్రాణప్రతిష్టాపన కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు ప్రాంతాల నుంచి కానుకలు కూడా పోటెత్తుతున్నాయి. అయితే ఒక వ్యక్తి వినూత్నంగా సుమారు 20 కేజీల బిస్కెట్లతో రామ మందిరం ప్రతిరూపాన్ని నిర్మించాడు. (Ram Mandir Replica With Biscuits) పశ్చిమ బెంగాల్కు చెందిన ఛోటాన్ ఘోష్ మరోసారి తన ప్రతిభను ప్రదర్శించాడు. స్నేహితులతో కలిసి ఐదు రోజులు శ్రమించి నాలుగు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న రామ మందిరం నమూనాను తయారు చేశాడు. దీని కోసం పార్లే-జీ కంపెనీకి చెందిన 20 కేజీల బిస్కెట్లను వినియోగించాడు. థర్మోకోల్, ప్లైవుడ్, జిగురు సహాయంతో దీనిని రూపొందించాడు. వినూత్నంగా బిస్కెట్లతో తయారు చేసిన రామ మందిరం ప్రతిరూపం ఎంతో ఆకట్టుకుంటున్నది. బెంగాల్లోని దుర్గాపూర్లో ప్రజల సందర్శన కోసం దీనిని ఉంచారు.
కాగా, ఛోటాన్ ఘోష్ గతంలో చంద్రయాన్-3 ప్రతిరూపాన్ని తయారు చేసి తన ప్రతిభను చాటాడు. స్థిరమైనదిగా కాకుండా 30 అడుగుల ఎత్తుకు రాకెట్ వెళ్లి చంద్రయాన్-3 విడిపోయి చంద్రుడిపై సాఫ్ట్ల్యాండ్ అయ్యే విధంగా దీనిని రూపొందించి అందరి మన్ననలు పొందాడు.