న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం రోజున దేశంలో 2.5 కోట్ల మందికి కోవిడ్ టీకాను వేశారు. నిన్న అర్థరాత్రి 11.58 నిమిషాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. చారిత్రాత్మక ఫిగర్ను అందుకున్నట్లు ఆయన తెలిపారు. నిన్న రాత్రి 9 గంటలకు కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిన తీరు పట్ల ప్రతి భారతీయుడు గర్వంగా ఉన్నట్లు చెప్పారు. హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్లకు ఆయన థ్యాంక్స్ చతెలిపారు. నిజానికి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కోటిన్నర మందికి కోవిడ్ టీకా ఇచ్చేశారు. అయితే ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో టీకాలు ఇచ్చిన దేశాల్లో చైనా కూడా ఉంది. జూన్ నెలలో ఆ దేశం ఒకే రోజు 2.47 కోట్ల మందికి టీకాలు ఇచ్చింది.
శుక్రవారం సాయంత్రం వరకు ఇండియాలో ఒకే రోజు వ్యాక్సినేషన్ రెండు కోట్లు దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సౌత్ ఈస్ట్ ఏషియా ఆఫీసు తన ట్వీట్లో తెలిపింది. మరో మైలురాయిని అందుకున్న ఇండియాకు డబ్ల్యూహెచ్వో కంగ్రాట్స్ తెలిపింది. హెల్త్ వర్కర్లతో మంత్రి మాండవీయ ఈ మైలురాయిని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే శుక్రవారం రోజున ప్రధాని మోదీ 71వ పుట్టిన రోజు కావడం విశేషం.